Friday 5 December 2014

పల్నాటి యుద్దం సినిమా

పల్నాటి యుద్ధం



కొత్త చిత్ర నిర్మాణ సంస్థలు ప్రారంభం కావడం, ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం పెంచిన వినోదపు పన్ను భారం అవుతోందని, నిర్మాణ వ్యయం కూడా పెరిగిపోయిందని భావించిన పాత నిర్మాణ సంస్థలు కొన్ని తెలుగు చిత్రాలు నిర్మించడం ఆపి, తమిళంలో చిత్రాలు నిర్మించడానికి సంకల్పించడం, రెండు స్టూడియోలను తెలుగువారు ప్రారంభించడం, విజయవాడలో నవయుగ ఫిలింస్‌ పంపిణీ సంస్థ ప్రారంభించడం 1947లోని ముఖ్యమైన విశేషాలు. ఈ ఏడాది పల్నాటియుద్ధం, యోగి వేమన, బ్రహ్మరథం, గొల్లభామ, రత్నమాల, రాధిక చిత్రాలు నిర్మించగా రత్నమాల తప్ప మిగతా చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో యోగి వేమన పల్నాటి యుద్ధం, గొల్లభామ చిత్రాలకు పేరొచ్చింది. 1947 ఆగస్టు 15న మన దేశం బానిస శృంఖలాలనుండి విడివడి స్వతంత్రదేశంగా అవతరించడంతో దర్శక నిర్మాతలు సాంఘిక సమస్యలకు చిత్ర ఇతివృత్తాలు ప్రాధాన్యత యిచ్చే ప్రయత్నం వెంటనే ప్రారంభించారు.
చిత్ర దర్శకుడుగా తరువాత మారి మంచి చిత్రాలు రూపొందించిన వేదాంతం రాఘవయ్య ఈ ఏడాది విడుదలైన యోగివేమన, పల్నాటియుద్ధం చిత్రాలకు నృత్య దర్శకత్వం నిర్వహించడం విశేషం.
భానుమతి, రామకృష్ణ దంపతులకు జన్మించిన పుత్రుడు భరణి పేరున భరణి పిక్చర్స్‌ నిర్మాణ సంస్థను భానుమతి ప్రారంభించి 'రత్నమాల' చిత్రాన్ని భర్త రామకృష్ణ దర్శకత్వంలో చిత్ర నిర్మాణం ప్రారంభించారు.
పల్నాటి యుద్ధం
సహాయ సంపాదకుడుగా పనిచేసి, ప్రజామిత్రకు సంపాదకుడుగా వ్యవహరించిన గూడవల్లి రామబ్రహ్మం సినీరంగంలో ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా, పబ్లిసిటీలో సలహాలు యిచ్చేవానిగా వ్యవహరిస్తూ 'మాలపిల్ల' చిత్రానికి దర్శకులై, ఆ చిత్ర విజయంలో 'రైతుబిడ్డ' రూపొందించారు. 'రైతుబిడ్డ' కొందరు జమీందార్ల ఆగ్రహానికి బలి అయింది. తరువాత ఆ ధోరణి చిత్రాలు మాని 'ఇల్లాలు, అపవాదు, పత్ని, పంతులమ్మ, మాయాలోకం' చిత్రాలు రూపొందించారు. వీటిలో కొన్ని బయట సంస్థలు నిర్మించిన చిత్రాలు. 'పల్నాటియుద్ధం' రూపొందించాలనే కోరిక చాలా కాలంగా వుండేది. 'పల్నాటియుద్ధం' ప్రారంభించిన తరువాత అనారోగ్యం ఏర్పడింది. కొంత భాగం షూటింగ్‌ చేసాక ఈ చిత్రం పూర్తి చేసే బాధ్యతను ఎల్‌.వి.ప్రసాద్‌కి అప్పగించారు. గూడవల్లి రామబ్రహ్మం అక్టోబర్‌ 1946లో మరణించారు. మరణానంతరం 'పల్నాటియుద్ధం' సెప్టెంబర్‌ 47లో విడుదల అయింది. 'పల్నాటియుద్ధం' చిత్రం రూపొందించాలన్న ఆలోచన చాలా కాలం నుంచి గూడవల్లికి ఉన్నందున పల్నాటియుద్ధం బుర్రకథలను విని, అందుకు సంబంధించిన గ్రంథాలను చదివి, స్క్రిప్టు తయారు చేయించారు. బ్రహ్మనాయుడుగా డా. గోవిందరాజుల సుబ్బారావు, నలగామరాజుగా శ్రీవత్స వెంకటేశ్వరరావు, నరసింగరాజుగా లింగమూర్తి, బాలచంద్రుడుగా అక్కినేని నాగేశ్వరరావు, నాగమ్మగా కన్నాంబ, మాంచాలగా ఎస్‌.వరలక్ష్మి, కొమ్మరాజుగా గిడుగు సీతాపతి, మలిదేవరాజుగా సదాశివరావు, అలరాజుగా కోనేరు కుటుంబరావు, కన్నమదాసుగా వి. కోటేశ్వరరావు, సుబ్బన్నగా వంగర, రాజనర్తకిగా రాజబాల, పేరమ్మగా చంద్రకళ, ఐతాంబగా జి. విశ్వేశ్వరమ్మ నటించారు.
శ్రీ శారదా ప్రొడక్షన్స్‌ పతాకాన గూడవల్లి రామబ్రహ్మం నిర్మించి, కొంత చిత్రాన్ని దర్శకత్వం చేసి పక్షవాతం పాలవడంతో మిగతాది ఎల్‌.వి.ప్రసాద్‌ పూర్తి చేసారు. గూడవల్లి అనారోగ్యం కారణంగా బావమరిది కోగంటి వెంకట సుబ్బారావు నిర్మాణ బాధ్యతను చేబట్టారు. రామబ్రహ్మం, శారద దంపతులకు అంకితమిచ్చారు 24-9-47న విడుదల చేస్తూ.
బ్రహ్మనాయుడు వీరవైష్ణవుడు. నాగమ్మ వీర శైవ మతస్థురాలు. నాగమ్మ దురభిమానం 'పల్నాటియుద్ధం'కి కారణమౌతుంది.
పల్నాటిసీమ నలగామ రాజు పాలనలో వుంటుంది. నలగామరాజు సవితి తమ్ముళ్ళు నరసింగరాజు, మలి దేవరాజు. మలి దేవరాజుకు బ్రహ్మనాయుడు అంటే అపారమైన అభిమానం. పల్నాటి సీమలో అందరికీ బ్రహ్మనాయుడు అంటే అభిమానము అతని మాట వేదవాక్కు. బ్రహ్మనాయుడు మాచర్ల చెన్నకేశవ ఆలయంలో హరిజనులకు ప్రవేశం కల్పించడం, నిమ్నజాతికి చెందిన కన్నమదాసుని సైన్యాధికారుని చేయడంతో అగ్రవర్గాల లతో పాటు నాగమ్మకూడ కోపం వస్తుంది. బ్రహ్మనాయుడు మీద నాగమ్మ రాజసభలో ఆరోపణలు చేస్తే బ్రహ్మనాయుడు బదులివ్వక సభ వదలి వెళ్ళిపోతాడు. మలిదేవుడు బ్రహ్మనాయుడుతో వెళ్ళిపోతూ రాజ్యాన్ని పంచమనడంతో మాచెర్ల సీమను మలిదేవునికి ఇస్తాడు నలగామరాజు. మాచర్లను బ్రహ్మనాయుడు సహకారంతో పాలిస్తున్న మలిదేవుడుని చూసిన నాగమ్మకు కోపం తారాస్థాయికి చేరుతుంది. కోడిపందాలు పెట్టించి మలి దేవుణ్ణి ఓడిస్తుంది. ఫలితంగా ఏడేళ్ల వనవాసం చేయాల్సి వస్తుంది. వనవాసం అయ్యాక రాజ్యం కోరితే, నాగమ్మ ప్రేరణతో రాయబారి అలరాజు హత్యకు గురి అవుతాడు. యుద్ధం ప్రారంభమవుతుంది. బ్రహ్మనాయుడు కుమారుడు బాలచంద్రుడు భార్య మాటలతో యుద్ధరంగానికి వెళ్లి అలరాజుని చంపిన నరసింగరాజు తల నరుకుతాడు. ఇందులో సతీసహగమనం కూడా వుంది.
బాలచంద్రుడు మరణంతో బ్రహ్మనాయుడు చెలరేగిపోతాడు. పల్నాడు వల్లకాడుగా మారిపోవడంతో పశ్చాత్తాపం ఏర్పడుతుంది బ్రహ్మనాయుడు, నాగమ్మలకు.
'ఎవరవయా దేవా, తానా పంతము నాతోనా, ఝణఝణ కాలాంతకి', పాటలను కన్నాంబ, 'చందమామా ఓ చందమామా', 'ఈ కుహురాత్రి నా రాజు వేంచేయునా', 'రణములో తొడగొట్టి రాగోల బట్టి', 'రతిరాజ సుందరా, రణరంగ ధీరా' పాటలను ఎస్‌.వరలక్ష్మి మేత దారినబడ్డ మేలంపుటావ్‌, తీరిపోయనా... మాతా...' పాటలను ఘంటసాల, 'తెర తీయగా రాదా దేవా' పాటను ఘంటసాల, కన్నాంబ, 'చూతము రారయ్యా, చెన్నమ్మను' పాటను ఘంటసాల, అక్కినేని, వచ్చునటే రాజూ పాటను ఉడుతా సరోజిని, నేడే నిజమురా పాటను సుందరమ్మ ఓహో చారుశీలా పాటను అక్కినేని, ఎస్‌.వరలక్ష్మి ఆలపించారీ చారిత్రక చిత్రంలో.
మాటలు పాటలు సముద్రాల రాఘవాచార్య, సంగీతం గాలి పెంచల నరసింహారావు, ఛాయాగ్రహణం జితేన్‌ బెనర్జీ, సౌండ్‌ దిన్షా కె టెహ్రాని, కళ నాగూర్‌, ఎస్‌.వాళి సమకూర్చారు.
గొల్లభామ
మీర్జాపురం రాజా శ్రీ శోభనాచల గొల్లభామ సి. పుల్లయ్య దర్శకత్వంలో 'గొల్లభామ' చిత్రాన్ని నిర్మించారు. కృష్ణవేణి, ఈలపాట రఘురామయ్య ఈ చిత్రంలోని ముఖ్య పాత్రధారులు. దాసరి కోటిరత్నం, లీలాబాయి, సుందరమ్మ, గంగారత్నం, రామిరెడ్డి, వెల్లంకి, తీగల, రేలంగి, ఎ.వి.సుబ్బారావు, కోటేశ్వరరావు, మల్లికార్జునరావు, కె.వి.సుబ్బారావు, రామమూర్తి మిగతా పాత్రలు పోషించారు.
సంగీతం ఎస్‌.బి.దినకర్‌ రావు, ఛాయాగ్రహణం కొట్నిస్‌, కళ శర్మ, ప్రొడక్షన్‌ బి.ఎ.సుబ్బారావు నిర్వహించారు.
రాధిక
ఆర్‌. బాలసరస్వతి, పద్మనాభరావు ముఖ్యపాత్రలు పోషించిన 'రాధిక' చిత్రాన్ని శ్రీ ఛత్రపతి పతాకాన ఆర్‌.పార్థ సారథి నాయుడు నిర్మించారు. కాళ్ళకూరి సదాశివరావు ఈ చిత్రానికి దర్శకుడు. అంతకుముందు చింతామణి, కుచేల, సులోచన, లంకా దహనం చిత్రాలను డైరక్ట్‌ చేసారు కాళ్ళకూరి సదాశివరావు.
బ్రహ్మరథం
భక్త మార్కండేయ, మైరావణ, దక్షయజ్ఞం, భక్త ప్రహ్లాద, సంసారనారది చిత్రాలకు దర్శకత్వం నెరపిన చిత్రపునారాయణ మూర్తి దర్శకత్వంలో శ్రీ వెంకట్రామా పతాకాన 'బ్రహ్మరథం' చిత్రం నిర్మించారు. అద్దంకి, జయమ్మ ఈ చిత్రానికి ముఖ్య పాత్రధారులు.
సోర్స్- ఆంధ్రప్రభ న్యూస్,   వి.ఎస్‌.కేశవరావ్‌

No comments:

Post a Comment