Thursday 4 December 2014

నాగార్జునకొండ మ్యూజియం

    చరిత్రకు సాక్ష్యం..
    నాగార్జునకొండ మ్యూజియం
    అపారమైన కళా సంపద లభ్యం
    విశేషంగా ఆకట్టుకుంటున్న పురావస్తు ఆధారాలు
    దేశ, విదేశాల నుంచి పర్యాటకుల రాక
    నేడు వరల్డ్ మ్యూజియం డే 
    చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నాగార్జున కొండ మ్యూజియం నిలుస్తోంది. ఇక్కడ పురాతన వస్తువులు, చరిత్రకు సంబంధించిన ఆధారాలు, బుద్ధుడి విశేషాలు లభిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకునేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. నేడు వరల్డ్ మ్యూజియం డే సందర్భంగా ఒకసారి నాగార్జున కొండ మ్యూజియం గురించి తెలుసుకుందాం..

    - టీ మీడియా, నాగార్జునసాగర్
    నాగార్జునసాగర్‌కు సమీపంలో కష్ణానది రిజర్వాయర్ మధ్యనున్న నాగార్జునకొండ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడికొచ్చిన పర్యాటకులు బుద్ధుడి ప్రతిమకు ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తుంటారు. ప్రపంచంలో మానవ నిర్మిత జీవి మ్యూజియంలో ఇది మూడోది. మహాయాన బౌద్ధ ప్రవక్త ఆచార్య నాగార్జునుడి మహా విశ్వవిద్యాలయం, బుద్ధుడి మహాస్తూపం, విశాలమైన వివిధ భిక్షు విహారాలు మొదలైన వాటితో ఇక్షాకుల రాజధానిగా విరసిల్లిన విజయపురి ప్రాంతం సాగర్ గర్భంలో ముంపునకు గురికాకుండా పురావస్తు శాఖ అక్కడి విశేష సామాగ్రిని పరిరక్షించి నాగార్జునకొండ మ్యూజియంలో భద్రపరిచింది.

    అందులోని రాజ్యచౌదాలు, సింహాల విహారం, పాతరాతి యుగం, నాటి సమాధుల మధ్య కొత్తరాతి యుగంలోని పరికరాలు ఆకాలంలో వాడుకలోని బంగారు నగలు, నాణేలు, ఇతర పనిముట్లు, శిలాశాసనాలు, తదితర వస్తువులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాగార్జునకొండ లోయలో బౌద్ధ శిథిల అవశేషాలు, ఇక్షాకుల విజయపురి శిథిలాలు ఏవిధంగా బయట పడ్డాయే వాటిని అదేవిధంగా పొందుపర్చారు. 
    ఇక్షాకుల శిలాశాసనలు, వారి జీవిత విశేషాలు, చౌదా స్తంభాలు, తదితరమైనవి సైతం మ్యూజియంలో ఉన్నాయి. విరిగిపోయిన శిల్పాలను అతికించి వాటి పూర్వపు ఆకారాన్ని కళ్లకు కట్టడం ఈ మ్యూజియంలోని ప్రత్యేకత. ఇక్కడి శిలలు, గౌతమ బుద్ధుని జీవిత విశేషాలు, ఆయన జాతక కథలు, మొదలైన వాటిని విపులంగా విశదీకరిస్తాయి. ఇవి నాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా నిలుస్తాయి. మ్యూజియం చుట్టుపక్కల ఉన్న కొన్ని కట్టడాలు వాటి పరిస్థితులను కళ్ల ముందు నిలుపుతాయి. 

    నాగార్జున విశ్వవిద్యాలయం..
    నాగార్జున విశ్వవిద్యాలయ శిథిలాల శేషాలు నాగార్జునకొండ లోయలో ఏవిధంగా ఉండేవో అదే విధంగా తిరిగి అమర్చారు. కష్ణానది తీరాన విశాల విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం ఉండేది. ఇది ప్రాచీన కాలపు గురుకులం. ఇక్కడ గురుశిష్యు నివాసాలు ఒకే దగ్గర ఉండేవి. సకల శాస్త్ర విజ్ఞాన కేంద్రమైన ఇది సమస్త విద్యలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ విశ్వ విద్యాలయంలో చైత్యగహానికి తూర్పున మూడు భాగాల ద్వారం ఒకటి ఉంది. ఒకే విహార భాగం ఐదు గదులు కలిగి మధ్య భాగంలో 55అడుగుల చతురాస్ర్తాకార మండపం ఉంది. దీన్ని విశ్వవిద్యాలయ లెక్చరర్ హాల్‌గా భావించేవారు. ఇక్కడ ఉన్న మరో మూడు గదులు బుద్ధ ధర్మ సంఘం, బౌద్ధ ఇక్షాక చిహ్నాలు కావచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో సర్క, తంత్ర, ఖనిజ, రసాయన, ఔషధ శాస్త్ర, శాస్ర్తాలు, మాధ్యమిక వాద, మహాయాన వాదాలను చిత్తశుద్ధులైన పండితులు, ఆచార్యులు బోధించే వారు. విశ్వ ఇక్షాక గ్రంథం, విషుధమగు రచయిత బుద్ధగోషుడు, ఆర్యదేవుడు, రాహువుడు, సిద్ధ నాగార్జునుడు మొదలైన వారు ఇక్కడ ఆచార్యులుగా పని చేసేవారు. ఇక్కడ విద్యను అభ్యసించేందుకు వివిధ దేశాల నుంచి తండోపతండాలుగా వచ్చేవారు. 

    హారతి దేవాలయం..
    విశ్వవిద్యాలయానికి కొద్ది దూరంలోనే హారతి దేవాలయం, దాని కింద చతురస్ర్తాకారంలో ఓ పెద్ద సరస్సు ఉంది. దీనికి నలు వైపులా మొట్లతో ఓడ్డు ప్రాంతాలు ఉన్నాయి. మెట్లపై గ్యాలరీ మాదిరిగా ఉండడంతో దీన్ని క్రీడాప్రాంతంగా భావించినా క్రీడా ప్రాంగణం మరో ప్రాంతంలో బయల్పడింది. 

    స్థాన వేదికం..
    నాగార్జున కొండపై ఇక్షాకుల రాజ్యసౌధ ప్రాగణ్యంలో కష్ణానదిని ఆనుకొని నిర్మించిన స్నానగట్టాల వేదికలు ఉన్నాయి. ఇది కేవలం స్నానాలకే కాక బస్సు సామాగ్రిని, నౌకల ద్వారా రవాణా చేయడానికి కాను రేవుగా సైతం వాడి ఉంటారని తెలుస్తుంది. ఈ స్నానపు గట్టాలు నునుపైన నాపరాళ్లతో చేయబడి నది స్నానానికి ఎంతో సౌకర్యంగా ఉండేవి. 

    కాకతీయ కట్టడాలు.. 
    మ్యూజియానికి సమీపంలోని కోట గోడలాంటి పెద్ద రాతి కట్టడం కాకతీయుల నాటి కట్టడంగా పరిగణిస్తున్నారు. కాకతీయులు ఈ ప్రాంతాన్ని సరిహద్దు సైనిక స్థావరంగా ఉపయోగించుకున్నరు అనడానికి ఈకోట గోడలు ఇప్పటికి సైతం చెక్కుచెదరకుండా ఉన్నాయి. 
    హిందూ దేవాలయాలు..
    కోట గోడలకు సమీపంలో పక్కపక్కనే రెండు హిందూ దేవాలయాలు ప్రాచీనమైనవి దర్శనమిస్తున్నాయి. కాకతీయుల కాలంలో వీటిని నిర్మించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం వీటి ఆలనాపాలన లేకపోవడంతో పాడుబడ్డ గబ్బిలాలకు ఆవాసాలుగా మారాయి. 

    మహా చైత్యం 
    ఇది బుద్ధధాతువుపై కట్టిన అందాల చైత్యం. ఈ స్తూపం నుంచి తవ్వి తీసిన ధాతువును ప్రస్తుతం బుద్ధుడి మొదటి ప్రసంగం చేసిన స్థారానదిలో ఉంచి పూజలు చేస్తున్నారు. ఇది శరీరక స్థూప జాతికి చెందినది. దీన్ని అంతర్భాగంలో బుద్ధ భగవానుడి అస్తికలు అమర్చబడి ఉన్నాయి. ఇది ప్రాచీన శిల్ప నిర్మాణ ప్రావీణ్యానికి నిదర్శనం. చక్రం, దాని ఆకులను ఇటుక గోడల్లా నిర్మించి ఆకుల మధ్య ఖాళీ స్థలాన్ని మట్టితో కప్పి స్తూపాకారంగా తయారు చేసి ఉపరితల భాగాన్ని చుట్టుపక్కల పాలరాతి పలకలు కట్టి అర్థగోలాకారంగా ఆశ్చర్యపోయేంత అందంగా దీనిని నిర్మించారు. 

    సింహాల విహారం..
    మహాచైత్యం పక్కనే సింహాల విహారం శిథిలాలు ఉన్నాయి. ఈ విహారంలో బుద్ధుడి విగ్రహాన్ని స్థాపించారు. శాంతి సిరి ఈ విహారానికి ఎన్నో ధానధర్మాలు చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఇవికాక ఇంకా కుర్మశతికుండ, ఇక్షాకుల రాజసైదాలు, పతీసహజమణగట్టం, ఆశ్వమేధ యాగశాల, తదితర కట్టడాలు సైతం నాగార్జునకొండలో నిక్షిత్తమై ఉన్నాయి. నాగార్జునకొండ చూడడానికి విజయపురి సౌత్ నుంచి కష్ణానదిలో 14కి.మీ లాంచీ ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే పర్యాటకులు ఇక్కడ ఉండేందుకు, చూడడానికి కానీ సమయం కేవలం గంట మాత్రమే ఉండడంతో ఇందుకు సంబంధించిన విశేషాలు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. అంతేగాక బుద్ధుడి ధాతువుని దర్శించే యోగం అందరికీ లేదు. ప్రముఖులు, అతిథులకు మాత్రమే అవకాశం కల్పించడం యాత్రికులను నిరుత్సాహ పరుస్తోంది. 
    source: namathe telangana.com

No comments:

Post a Comment