Friday 16 January 2015

" పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -10

భట్టు నలగామరాజునకు రాజనీతి విశేషంబులఁదెల్పుట

పగవృద్ధిబొందించు భ్రష్టులేకాని
అడగించునేర్పరు లవనిలోలేరు
నరసింగభూమీశు నమ్మికమీరు
తమ్ముడా మలిదేవధరణీశుకడకు
పంపుడికయేకమై పగలనునణచి
పలనాడుమొదలైన బహుభూములెల్ల
ఎదురెవ్వరునులేక యేలుడిసుఖిత
శృంగారయుతు నరసింగుభూమీశు
పంపుముమలిదేవ పతిగలయంగ
పోరుమంచిదిగాదు భూమినెక్కడను
పాడౌనుదేశంబు పగమించెనేని
ప్రజలెల్లనశియించి పారిపోవుదురు
బండారమునకును పైకంబులేదు
రాణువ అందుచే రహిచెడియుండు
చేజీతగాండ్లెల్ల జెలగికోపించి
యీగలజీతంబు లిమ్మందురపుడు
పతిబంటుమేరలు పరిహృతమగును
పంపినపనిచేయు పాలుమాలుదురు
తెలిసినశాత్రవుల్ ధీరతతోడ
భూమినిగొనుటకు బుద్ధిపెట్టుదురు
పగవారివార్తలు పరికింపలేరు
మేకొనిమీలొన మీరుపోరాడ
చూచెడువారికి జులకనయౌను
కోరిశాత్రవులుమీ గుట్టెఱుంగుదురు
పలువలుమిముజేరి పగజావనీక
చెప్పుచునుందురు చెనటివాక్యములు
ఐకమత్యముచెడు నద్దానితోడ
చెడునుబలంబును చెడునుభాగ్యంబు
చెడునుయశంబును చెడునుశౌర్యంబు
చెడునురాజ్యంబులు చెడ్డపిమ్మటను
దేశంబు పరనృపాధీనమౌసుమ్ము
పారతంత్ర్యంబు మీపైబడగలదు
పరతంత్రజనముల పాలికష్టములు
చెప్పంగనలవియే శివునకునైన
పంజరంబుననున్న పక్షులరీతి
బంధించిబుట్టలో పాములవాఁడు
వదలకపెట్టిన ఫణులచందమున
గంగిరెద్దులవాఁడు కావరమణచి
ముకుదాడుపొడిచిన పోతెద్దులట్లు
బోనులోనుంచిన పులులవిధంబు
స్వతంత్ర్యహీనఁత బడియుండవలయు
పరికింపగా మనోవాక్కాయములను
ప్రథమమ్ముపట్టగా రానిదిగాన
వాక్కాయములురెండు బంధింపబడును
మనసులోఁబుట్టిన మంచితలంపు
లాచరణమునందు అలవికాకున్న
జన్మఫలంబేమి చచ్చుటేమేలు
అవ్యక్తకీట తిర్యగనేకహీన
యోనులలో నెన్నియోమార్లు పుట్టి
పడయకపడయక పడిసినయట్టి
దుర్లభనరజన్మ దూషితంబగును
పార్థివాయిటువంటి పారతంత్ర్యంబు
కటకటా పగవారికైననువలదు
కుందబృందసితాబ్జ కుముదాప్తతార
హీరడిండీరనీ హారపటీర
ఘనమరాళంబుల కాంతినిమించు
సత్కీర్తివేగమే సరవినశించు
అపకీర్తిజగముల నధికమైయుండు
ఉభయవాదులుమీర లొక్కటైయున్న
సకలకార్యంబుల సమకూర్పవచ్చు
ప్రజలకుసుఖమౌను పంటలుపండు
ధనముసంపాదింప దగియుండునపుడు
సంపూర్ణకాములై సకలసేవకులు
కాపాడుదురుమిమ్ము కనిపెట్టియుండి
పరరాజులనుగొల్వ పైకొనిపోయి
అమితమ్ముగాగ ధనాదులనెల్ల
కొనవచ్చు ధర్మముల్ కూర్పంగవచ్చు
సత్కీర్తిజగముల సాంద్రమైనిల్చు
కలహించి వెనుకటి కౌరవులెల్ల
గతిచెడిపడినట్టి కష్టముల్ వినమె
పగపెరిగించుట భావ్యంబుగాదు
ఉభయవాదులుమీర లొకటికనుక
నయమొప్పజెప్పితి నామాటవినుడి
అనుచుజెప్పిననీతు లాలింపడయ్యె

నలగాముడు భట్టుమూర్తిచెప్పిన వాక్యంబుల నిరాకరించుట

కామభూపాలుండు కనులెర్రచేసి
కోపంబుమించగా కొలువెల్లజూచి
వింతిరేసభవారు వీరలతలపు
రాణువతో మును రణభూమినిలిచి
తమ్మునంపమటన్న ధర్మమాతమకు
విన్నవారలెల్ల వెరగందగలరు
మగతనంబునబుట్టి మగకాశగట్టి
మగటిమివిడనాడి మానంబువిడిచి
వారున్నతావుకు వచ్చుటతగవె
భటవృత్తివాడవై పల్కితివిట్లు
పూర్వకార్యంబుల పుట్టువుమరచి
ఈరీతిబల్కితి వేమందునిన్ను
అనరాదువినగూడ దామాతలిపుడు
తమభూమినిచ్చిన దక్కించుకొనగ
శక్తిగల్గినజాలు సదయుడనగుచు
ఇచ్చితితమభూమి యేలికొనంగ
అనుచువింతగబల్క ఆమాటలకును
భావం తెలియక పటురోషమంది
వవ్వుచుడగ్గరి నాయకురాలు

నాయకురా లేకాంతంబున నలగామునకు సంధివిముఖంబులైన మాటలుచెప్పుట

ఎవ్వరువినకుండ ఏకాంతమునను
పల్కెకామునితోడ ప్రావీణ్యమొప్ప
విను నరనాయక విన్నవించెదను
బాలరాజులుతాను బ్రహ్మనాయకుడు
కలిగినబలముతో కార్యమపూడి
కలనుప్రవేశించి కదనంబుజేయ
కనిపెట్టియున్నాడు గ్రక్కునమిమ్ము
రమ్మనిపిలిచిన రామనరాదు
కలిగినబలిమియు కలిమియువిడిచి
మగటిమివిడనాడి మానంబుదూలి
పంచిభూమినొసంగ పంతంబుగాదు
కయ్యంబుచేయుట ఘనవిచారంబు
ఇద్దరురాజులై యేర్పడిరేని
అవనిలోపలనాఙ్ఞ కమరికయౌనె
సిరిపొత్తుచేయిట చెల్లునుగాని
ఆఙ్ఞపొత్తిచ్చుట అదినీతిగాదు
చర్చించిచూచిన ఙ్ఞాతియుండంగ
అగ్నితోబనియేమి అన్నవాక్యంబు
వినవెపెద్దలుచెప్ప పృథ్వీతలేంద్ర
పరగకుజోటివ్వ పాదుకొనెదరు
తరువాతబెరుకంగ ధరనసాధ్యంబు
పాండవులకుభూమి పాలిచ్చిపిదప
కౌరవులేమైరి కార్యమర్మజ్ఞ
నీవెరుంగనినీతి నేనెరుంగుదునే
అనవినిభూమీశు డాత్మలోదెలిసి

" పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -9

నలగామరాజు సభయందు విద్యా వినోదములు జరుగుట

వింతగాగాయనుల్ వీణలబూని
తంత్రులుబిగియించి తగసుతిబెట్ట
సరిగమేళములైన స్వరసప్తకంబు
ఆరోహణావరోహణ భేదములను
బహురాగసంప్రాప్తి పట్టుగాజేర్చి
సంచారిసంస్థాయి సరసభావముల
మృదుతరశబ్ధార్థ మిళితమైనట్టి
ఘనతరాలంకార గతిపరంపరలు
మూర్చనల్ మొదలైన ముఖ్యధర్మములు
జంత్రంబుగాత్రంబు జంటగావించి
చెలగియెండినచెట్లు చిగిరించునట్లు
పాడిరితమతమ ప్రావీణ్యమెసగ
పాకశాసనుకొల్వు పగిదినున్నట్టి
వేళనేతెంచిరి విద్యాధికతను
నాట్యమేళమువారు నవవిలాసముల
వచ్చినమ్రతమ్రొక్కి ప్రక్కగానిల్వ
ఘనవైభవంబున కామభూవిభుడు
నవ్వుచుసెలవిచ్చె నాట్యంబుచేయ
వరమృదంగములెస్స వాయించుమేటి
కుడిభాగమునయందు కుదురుగానిలిచె
తాళమానఙ్ఞులు దాపటిదిశను
నిలిచిరుత్సాహంబు నేరుపుమీర
ముఖవీణవాయించు ముఖ్యుడొకండు
రాగమాలాపించు రమణులిద్దరును
నిండువేడుకతోడ నిలిచిరివెనుక
కంజలోచనయను ఘనమైనపాత్ర
మదనుపట్టపుదంతి మంజులవాణి
భరతశాస్త్రోచిత బహురాగములను
గరిమతోనేర్చిన కంతుబాణంబు
వచ్చిసభాసదుల్ వర్ణించిచూడ
నిలిచినాట్యమునకు నేర్పరియైన
వేత్రపాణికిదగ వినయంబుజూపి
అతడొసంగినగజ్జ లతిభక్తితోడ
పాదములంగట్టి పంచవర్ణముల
కాశగట్టిగగట్టి కడుజపంబడర
మద్దెలతాళాల మధ్యనిల్చుండి
ఓరచూపునరాజు నొయ్యనజూచి
సమపాదయుతమైన స్థానకస్థితిని
తాత్పర్యమున దేవతలకునుమ్రొక్కి
పుష్పాంజలియొసగి ఘనకళాశైలి
కైముడికట్నముల్ కనుపింపజేసి
వెలయంగతొమ్మిది విధములయినట్టి
భూచారినాట్యంబు పొందుగాసలిపి
పదునారువిధములై పరగినయట్టి
ఆకాశచారియు నమరంగనాడి
అంగహారాఖ్యగలట్టి నాట్యంబు
విదితమౌతొమ్మిది విధములనాడి
గతిచారిభేదముల్ గనుపడునట్టు
బ్రమణసంయుతదీప్త పటిమమీరంగ
పాణిభేదములను బాటించిచూపి
స్థానకసంచయ సంయుక్తి అమర
ప్రేరణిదేశిని ప్రేంఖణశుద్థ
దండికాకుండలి తగుబాహుచారి
సప్తతాండవములు సల్పెచిత్రముగ
సభవారలాశ్చర్య సంయుక్తులైరి
తరువాతనిరుమేల దగుచెలులమర
సయుతాసంయుతా చలనసంకుచిత
నానార్ధకరములు నాట్యహస్తములు
శిరమునుచూపులు చెక్కిళ్ళుబొమలు
దంతోష్ఠకంఠముల్ తగు చుబుకంబు
ముఖరాగవక్షముల్ మొదలుగానెన్న
అంగంబులారు ఉపాంగంబులారు
ప్రత్యంగసముదాయం బారునుగూడి
యెనిమిదిపదియగు నెసగునంగంబు
లమరంగనభినయం బాశ్చర్యముగను
మాచర్లచెన్నుని మహిమంబుదెలుపు
ఆంధ్రసంస్కృతవాజ్మయాదిగీతముల
భావంబులెస్సగ ప్రకటంబుచేయ
చూచిరంభాదులు చోద్యంబునొంది
శిరసులువంచి సిగ్గునుచెంది
రపుడుభూమీశు డాదరంబొప్ప
వస్త్రభూషణములు వారలకిచ్చి
భట్టునురమ్మని పంపించెపిదప

రాయబారమునకు వచ్చిన భట్టు నలగామరాజుసభయందుఁ బ్రవేశించుట

తురగంబుపైనెక్కి దుమికించుకొనుచు
వచ్చికొల్వునుజేరి వాజినిడిగ్గి
భూమీశునెదుటను బొందుగానిలిచి
రాజాధిరాజ విరాజితకీర్తి
రాజవేశ్యావిట ప్రభావప్రకట
గండరగండాంక ఘనదానచతుర
ధైర్యనిర్జితమేరు ధరణీధరేంద్ర
శౌర్యవిక్రమకళా సంపూర్ణచంద్ర
భాస్కరసమతేజప్రౌఢగుణాఢ్య
మానదుర్యోధన మైలమ్మసుతుడ
అనుగుభూపతిపుత్ర అంచితగాత్ర
వీరకామనరేంద్ర విభవదేవేంద్ర
రాయబారమునకు రాజుపంపించ
వచ్చిన అల్లుని వధియించినారు
మనసునక్రోధించి మలిదేవరాజు
తమ్ములుతానును దనబంధుజనులు
వీరనాయకతతి విఖ్యాతిమెరసి
ఖరదూషణాదులు గతమైనచోటు
శ్రీశైలభూమిలో శ్రేష్ఠమైనట్టి
కార్యమపురిభూమి ఘనపుణ్యరాశి
పటుతరవిక్రమ వైభవంబలర
ధాటిమైనిల్చిరి దండుతోగూడ
అలరాజుతోడనే హతమౌదుమంచు
చలమునకోపంబు సంవృద్ధినొంద
వీరనాయకులును వేగిరపడగ
మలిదేవభూపతి మన్నించియిటకు
నన్నుబుత్తెంచెను నరనాధవినుము

" పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -8

నాయుడు నలగామరాజువద్దకు భట్టును రాయబారమునకై పంపుట

భట్టునుపొమ్మన్న పయనమైతాను
వాయువేగముగల వాజిపైనెక్కి
బంగారుగుబ్బతో భాసిల్లుగొడుగు
పట్టుకముందర భటుడొకడేగ
విలసిల్లుజల్లుల వింజామరంబు
లీవలావలనుండి యిద్దరువీవ
గురిజాలకేతెంచి కువలయభర్త
తావుకుముందర తగచెప్పిపంపె
వినికామభూపతి విభవంబుమెరయ
కొలువుశృంగారింప గూర్చినవారి
పంపించెవారలు పరిచారజనుల
రప్పించితీర్చిరి రమణీయముగను
కస్తూరిచేతను గలయంగనలికి
మూత్యాలతోడుత ముగ్గులు వెట్టి
కర్పూరముదకంబు కలిపిముందటను
కలయంపిచల్లి నిష్కల్మషభంగి
శ్రీరామకథలను శ్రీకృష్ణకథలు
పన్నుగావ్రాసిన పటములదెచ్చి
కట్టిరిగోడలు కనుపడకుండ
మౌక్తికమంజీర పంజుపుంజంబు
వ్రేలాడుచుండెడు వివిధవర్ణముల
ఘనవితానమ్ములు కట్టిరిమీద
నిలువుటద్దంబులు నిలిపిరిదిశల
తంతుపటములు విస్తారముగబరచి
వన్నెలపటములు వానిపైబరచి
పరచినవానిపై పంచవర్ణముల
రత్నకంబళములు రంగుగాబరచి
కంచననవరత్న ఖచితమైనట్టి
పీఠమొకటిదెచ్చి పెద్దకొల్వునను
నిలిపిరిదిక్కుల నిగ్గులుదేర
చెలువుగా నీరీతి జేసినవార్త

నలగామరాజు కొల్వుకూటమున కేతెంచుట

వినినంత నలగామపృథీశ్వరుండు
సరసంపుపన్నీట జలకంబులాడి
ఘనశుచివస్త్రముల్ కటియందుదాల్చి
చిత్రాసనంబుపై జేరికూర్చుండి
నిలువుటద్దముజూచి నేరుపుమీర
తిలకంబునుదుట సుస్ఠితిమీరదీర్చి
సంధ్యాదికృత్యముల్ సమ్మతిజేసి
భుజియించితరువాత పునుగుజవ్వాజి
కస్తూరిరసమును గలిపినయట్టి
శ్రీచందనమును మేన చెలువుగాబూసి
తగటుకూనంబులు ధరియించితలకు
ఒకవింతయిష్టీష మొప్పుగాగట్టి
నవరత్నమాల కంఠంబునవ్రేల
డంబుగా కర్ణకుండలములు మెరయ
భుజకీర్తులనియెడు భూషలుదాల్చి
మేనికిరక్షయై మించుతాయెతులు
దండచేతులరెంట ధారణచేసి
మురుగులుగొలుసులు ముంజేతులందు
తిరముగావ్రేళ్ళ ముద్రికలనుబెట్టి
నవరత్నఖచితంపు నడికట్టుదాల్చి
గండపెండేరంబు కాలికిబెట్టి
బంగారుదుప్పటి పైననుగప్పి
పావుకోళ్ళనురెండు పదములదొడిగి
కటికివారలుమ్రోల కనుపించిపొగడ
ఈవలావలజేరి హెచ్చరింపంగ
వేత్రహస్తులుగూడి విచ్చలవిడిని
సందడిదూరమై చనునట్లుచేయ
రహిమించ నంతఃపురంబును వెడలి
కొలువునకేతెంచె కుతుకంబుమీర
నిలిచెశృంగారంబు నేర్పునుగనగ
అంతటకింకరు లతివేగమునను
తూలికాతల్పంబు దూర్చినయట్టి
ముఖమల్లుగుడ్డలు మునుకొనితెచ్చి
పరచిపీఠముమీద బాగైనదిండ్ల
ఉంచినగనుగొని యుర్వీశుడైన
కామభూమీశుండు గద్దెపైనుండె
వెనుకను నరసింగవిభుడు గూర్చుండె
నాగమయొకవంక నమ్రతనుండె
బంధుజనముచుట్టు బలిసికొల్వంగ
వేదశాస్త్రఙ్ఞులు విద్వంసులెల్ల
ఆశీర్వదించుచు ఆసీనులైరి
సకలదేశాధీశ సచివపుంగవులు
ముకుళితహస్తులై ముందరనుండ్రి
శాస్త్రపారగులును సంస్కారయుతులు
కవులునుభటులును కనిపెట్టియుండ్రి.

" పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -7


ససైన్యముగ మలిదేవరాజు కార్యమపూడింజేరుట

భానుండుదిక్కుల ప్రబలెనావేళ
తరువాతమలిదేవ ధరణీశ్వరుండు
పొలుపొందకార్యమ పురికేగదలచి
తానుబ్రహ్మగలసి తగవిచారించి
ఘనమైనడెరాలు గట్టినబండ్లు
ఇతరవస్తులుమోసి యేతెంచునట్టి
యెద్దులనొంటెల నెల్లముందుగను
సాగించియంతట సంతోషమునను
కాలిబలంబుల ఘనఘోటకముల
మదమునవిలసిల్లు మంచిఏనుగుల
నాలుగుదిశలను నడువంగజేసి
వీరనాయకులూని వెసజుట్టినదువ
తమ్ముడునాయుడు తగుభందుజనులు
తమతమవాహనోత్తమములనెక్కి
వెంబడియేతేర విభవంబుమీర
తరచుగారత్నముల్ స్థాపించినట్తి
పాలకిలోనెక్కి బట్లునుతింప
ఇరువంకనరిగెల నెత్తిక్రమ్మంగ
పటువేత్రకుల్ బరాబరులొనరించి
"అవధారురాజేంద్ర" యని హెచ్చరింప
పూజ్యుండు మలిదేవభూపతిచనియె
ఐదువిధంబుల నమరువాద్యంబు
లాకాశమంతయు నదిరెడునట్లు
సాంద్రధ్వనుల్ హెచ్చె సంతసంబంది
కదనరంగంబైన కార్యమపూడి
పుణ్యభూమినిజేరి పొందుగాదండు
విడిసెనువైరులు వెక్కసంబంద
వేదశాస్త్రఙ్ఞులు విప్రులందరును
అధిపునాశీర్వాద మమరంగజేసి
సరసంపుభూమి ప్రశస్తంబొనర్ప
చెన్నకేశవదేవు శ్రీపాదజలము
తివిరిపూజారులు దెచ్చుటజేసి
తులసిపత్రంబులతోడ తీర్థంబు
అచ్చోతచల్లించి అలరు లగ్నమున
శంకుసంస్థాపన సమ్మతిజేసి
నిక్సేపముగరత్న నిచయంబులుంచి
తెచ్చినకంబంబు ధీరతతోద
నడికలనిన్నిల్పె నరనాథవరుడు
కాశ్మీరకస్తూరి కర్పూరయుక్త
పరిమళగంధంబు బాగుగాబూసి
మైసాక్షిగుగ్గులు మహితధూపంబు
అర్పించి అటమీద నారగింపంగ
మృగములమాంసంబు మెప్పుగావండి
పంచామృతంబులు పాయసాన్నములు
పేరైనపచ్చళ్ళు పిండివంటలును
భూతరాట్టునకప్డు భోజనంబిచ్చి
అఖిలభూతంబుల కాచారముగను
ఘనమైనపోతుల గావుచెల్లించి
తరువాత సర్పాఖ్య తటినిలోపల
పటుగంగధారనా బరగినమడుగు
పొంతకుజని వీరపుంగవులెల్ల
తమతమనామముల్ ధరలోనదరుచు
ప్రఖ్యాతినొందగ భక్తితోనందు
స్నానంబుజేసి విశాలతీరమున
నిలిపిరి లింగముల్ నేమంబుతోడ
తరువారమలిదేవ ధణీశ్వరుండు
నాయునితోడను నదికినేతెంచి
కాలోచితక్రియల్ క్రమముగాజేసి
నామతీర్థంబులు నయమొప్పదీర్చి
పటకుటీరములకు బన్నుగావచ్చి
సకలనాయకతతి సన్నిథినుండ
కొలువునగూర్చుండె కుధరారిరీతి
అప్పుడూబ్రహ్మన్న అవనీశుతోడ
ఉచితవిచారంబు నొనరించిపిదప
చెలగుచుసమరంబు చేయగావెలెను
తరచైనబలముతో తరలిరమ్మనుచు
పొలుపొందునలగామ భూమీశుకడకు.

" పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -6

బ్రహ్మనాయుడు కార్యమపూడి యుద్ధరంగముఁ జేరబోవుట

అనుచునచ్చటివృత్త మఖిలంబుచెప్ప
వినిబ్రహ్మనాయుండు వీరధైర్యమున
ద్వాదశసూర్యులు ప్రబలినరీతి
నెవ్వరికెరిగింప కేగెనావేళ
పొలుపొందనారుద్ర భూమికేతెంచె
నాలుగుకరముల నాయుడునిలిచె
ఆరుద్రవసుమతి నాశ్చర్యముగను
కూలినశల్యముల్ కురుచతుండములు
సొక్కినచర్మముల్ చుట్టలైఉన్న
పేగులునరములు పెంటలైఉన్న
యేడుమాసంబుల యెముకలుపగిలి
రాలిదట్టంబైన రాసులుతరుచు
మునిగిదుర్గంధంబు మొనసినమెదడు
గాలికిదూలెడు ఘనశిరోజములు
కాలికుప్పలుబడ్ద కాయవిభూది
చిదిమినశవములు చెదురుకొరువులు
నానావిధంబుల నాట్యముల్ సలుపు
భూతకోటులతోడ పొందుగానుండె
తలకాయపుర్రెల దగుబంతులాడు
శాకినుల్ మొదలైన సకలభూతములు
బెదరకవాదించు భేతాళచయము
పిల్లాటలాడెడు పెనుపిశాచములు
మిణుగురుల్ దిక్కుల ముంచిరాల్పుచును
కొమరొప్పపరుగిడు కొరవిదెయ్యములు
వేదమంత్రంబులు వెసపఠించుచును
బ్రహ్మనాయునిజూచి భయసంభ్రమమున
ఆశీర్వదించుచు నళుకుచుతొలగి
పరుగులుపెట్టెడు బ్రహ్మరాక్షసులు
కలగిబ్రహ్మన్నను కనినంతలోన
పారిభయమున బలుదైత్యవితతి
ఇటువంటిరణభూమి నెసగనీక్షించి
ఘనకార్యములకెల్ల కారణంబగుచు
ఎముకలపెంటయై యేహ్యమైఉన్న
కార్యమాపురిపుణ్య ఖనియగునట్లు
కావింతుదేవతల్ గనిసంతసింప
ధీరతశ్రీవీరతిరుపతిసేయ
వలెనంచునూహించి వైరులపాలి
కాలమృత్యువువంటి ఘనుడుబ్రహ్మన్న
భయదమౌ రణభూమి ప్రబలుడైనిలిచి
మూడుకాలంబుల ముచ్చటలెల్ల
తెలిసినయెరుకల తెరవనీక్షించి
బలువైనబ్రహ్మండ పజ్త్కులనెల్ల
పుట్టింపరక్షింప పొలియింపనేర్చు
బ్రహ్మదేవునివిష్ణు ఫాలలోచనుల
ప్రార్ధించికీర్తించి ప్రణతులచేసి
హరియొక్క పదియైన యవతారములను
మనసునదలబోసి మానంబురోసి
భువనరక్షణచేయ బుద్ధిలోనిలిపి
పరమేశ్వరునిగూర్చి పలికెబ్రహ్మయ్య
"ఓచక్రధర!స్వామి ఓకంజనాభ
జలముపైపవళించు సర్వభూతేశ
ప్రమథావతారులు బలువీరవరులు
ప్రధ్నవసుమతిలోన ప్రాభవమొప్ప
ఇత్తుముప్రాణంబు లీయనినంచు
వచ్చియున్నారదె వైభవంబలర
వీరసింహంబులు వీరనాత్యంబు
చేయుదురిప్పుడు స్థిరబుద్ధితోడ
పూతత్వహీనత పొరయునీభూమి
నిర్దుష్టముగజేయ నిన్నువేడెదము
నీచరణంబున నెరిజనియించి
గంగయై ఖ్యాతినిగాంచి లోకముల
క్షాళతమ్మొనరించెగదా పూర్వమందు
ఆజలరూపమై యమరుమేఘంబు
వర్షించియీభూమి పరమపూతంబు
చేసెడునట్లుగా సెలవిమ్ముతండ్రి"
అనుచుబ్రహ్మనవేడ నాలించిహరియు
ఫణిశాయియైయుండి పంపెదేవేంద్రు
నతడుప్రేరేపింప నానీలమేఘు
మాకాశమెల్లను నల్లినట్లుండి
గాఢాందకారంబు గప్పెభూస్థలిని
ఘూర్ణిల్లుధ్వనులతో కుంభినిమీద
ఉరుములుపిడుగులు నొయ్యనబడగ
తళతళమెరుపులు తరచుగామెరయ
వడగండ్లురాలంగ వాయువువిసర
వాగువంతలనీళ్ళు వరదలైపార
గుంతమిట్టనరాక కుంభినినెల్ల
ముంచెదేవతలంత మూకలైచూడ
జలజనాభునిపాద జనితమైనట్టి
గంగలోకములెల్ల క్రమ్మెనోయనగ
ఏకార్ణవంబుగా హెచ్చివర్షించె
అప్పుడాజలమధ్య మందుండియెక్క
పునుకజలముపైన బొర్లాడికొంచు
పడమరగావచ్చి బ్రహ్మన్నవద్ద
నిల్చిహసించెను నిష్కారణముగ
అప్పుడుబ్రహ్మన్నయు నానవ్వుజూచి
తలపుర్రెతోననె దగువాక్యములను
నవ్వినహేతువు నాతోడజెప్పు
వీనులనిండగా వినగోరినాడ
అనిననాయునితోడ నాపుర్రెపలికె
నాపూర్వమంత విన్నపముచేసెదను
శంఖచక్రాంకిత సకలలోకేశ
ఇందిరామందిరా యినచంద్రనేత్ర
జలజజజనకుండ శార్ఙ్గశరానా
సకలవేదమయాత్మ శ్యామలవర్ణ
సకలధర్మంబులు సమసెడువేళ
తగినరూపముదాల్చి ధరబ్రోతువెపుడు
వేదశాస్త్రంబులు వినుతులుసేయ
చాలగజడనిధిశయనించుచుందు
దనుజేంద్రసంహార తార్క్ష్యవాహనుడ
యెత్తితీయవతార మీయుగమునందు
శోభిల్లునీమేను జూడంగగలిగె
తప్పజూదకవిను తగుమనముంచి
దానవుడనుగాను దయ్యముగాను
భూరిభయంకర భూతంబుగాను
వాసియౌయాకాశ వాణినిగాను
రహిమించగ బ్రహ్మరక్షస్సుగాను
జలనిధికోటయై చక్కనైయుండు
దక్షిణజలనిధి దండనున్నట్టి
రమపురమనుపేర రాజిల్లుచున్న
పట్టణంబేలెడు పరమధర్ముండ
జలనిధిసోముడనేను సర్వజ్ఙ్ఞతిలక
ద్వాపయుగమున ధైర్యంబుతోడ
బహుతరాక్షౌహిణుల్ బలములగూర్చి
ధూర్జటికెదిరించి దూరమొనరించి
కరులుగుర్రంబులు కాలిమానుషులు
హతమైనపిమ్మట నాలంబులోన
పడితినిపగవారి పంతంబుగెలువ
రణధూర్తుడనుగాను రాజునుగాని
సర్వయుగజనులు సమసినకలని
గతిగానకీలాగు కాలంబుబుచ్చు
చెదురుచూచుచునుంటి మెంతయుమేము
వీరాగ్రగణ్యత వెలసిననీవు
కదనవిక్రముడవై కలనికివచ్చి
శోధింపదిరిగితి శూరధర్మమున
పరమాత్మ మాజన్మ పావనంబాయె
వైకుంఠపట్టణ వైభవంబెల్ల
కంటినాయునిమూర్తి కన్నందుచేత
నీపాదములధూళి నెరసినకతన
పావనంబాయెనీ భండనభూమి
ఇటువంటికనిలో నేపునమీరు
కదననాట్యముసల్ప కడుసంతసిల్లి
శంకరుడింద్రుండు సకలదేవతలు
ఎదురుగాచనుదెంచి యిత్తురిష్టములు
ఘనపవిత్రులుగాగ కలియుగమందు
వీరపుంగవులయి వెలయంగగలరు
పరువడిచనిన భూపరులలోగలసి
దివికెగెదముమేము దేవదేవేశ
అనిచెప్పిబ్రహ్మచే నంపించికొనిరి
కరమొప్పపండ్రెండు గడియలతడవు
హుంభవర్షంబయ్యె కుంభినియందు
నీతిచేభూతముల్ నిల్చికొల్వంగ
కలనికికర్త్రియై ఘనమైనశక్తి
గరిమబ్రహ్మన్నను గాంచియునిల్చె
నిలిచినగనిగొని నీలవర్ణుండు
"ఓవిశ్వమయమూర్తి ఓవిశ్వకర్త్రి
ఓలోకపావనీ యోజగద్ధాత్రి
యోశాంభవీదేవి యోలోకసేవ్య
సమరంబునకునీవు సాక్షివైయుండు"
మనుచుప్రార్ధనజెసి యాబ్రహ్మనీడు
మగిడెమనోవేగ మానితగతిని
వేగుజాముకువచ్చి విడిదిలోనిలిచె
తెల్లవారగనప్డు దివిజులుప్పొంగ
చుక్కలకాంతులు శూన్యమైయడగె
కలువలమిత్రుని కాంతులుతగ్గె
చీకటిగుహలలో జేరియుదాగె
గుడ్లగూబలుపోయి (గొందులనణగె)
చక్రవాకంబులు సంతసంబందె
కమలముల్ వికసించె గలువలుమొగిడె
తమతమకార్యముల్ తగజెసికొంచు
మోదంబునొందిరి భూజనులెల్ల
వేదమంత్రంబుల వినుతులుజేసి
అఖిలభూసురతతి ఆర్ఘ్యంబులియ్య
పూర్వపర్వతశిరః పూజ్యాగ్రమందు
ఘనతరమాణిక్య ఖచితసౌవర్ణ
కుంభంబువలెనిల్చి గురుతేజమునను

" పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -5

కార్యమపూడి రణరంగమును బరీక్షించుటకై బ్రహ్మనాయఁడు కన్నమనీని నర్ధరాత్రమునఁ బంపుట

అంతటబ్రహ్మన్న యానడిరాత్రి
కనుకులదాసుండు ఘనబాహుబలుడు
కన్నమయనువాని గ్రక్కునబిలిచి
వెనకటిరాజులు విక్రమస్ఫూర్తి
పోరాడిసమసిన బూడిదవెంట
యిలభీమమైనట్టి యెముకలపోగు
లెసగినరణమ్హూమి యెన్నికగాను
పావనంబుగజేసి బహుకాలమందు
కనిపెట్టియున్నట్టి ఘనరాజవితతి
దూరములోపలనుండి తొలగింపవలయు
ఇరవుగాకలనిలో ఈరాత్రివేళ
ఎవ్వరెవ్వరుగాచి యెట్లున్నవారో
అరసిరమ్మనిపంప నావీరఘనుడు
వాసనపెల్లైన వనమాలగదల
కరములగుజ్జరి కడియముల్ మెరయ
నేటైనపిడిఘంత నెమలిసొగసులును
నల్లనిదట్టిని నయమొప్పగట్టి
అర్థనారీఝుల్ల కాదులునమర
ఘోరభైరవగద కోరమీసములు
ఎగుభుజంబులుమించు వెరజేరుగ్రుడ్లు
ఘనమైనదేహంబు కాలిపెండెరము
వెరవైనభీకర వేషంబుతోడ
కదలెకన్నెమనీడు కదనభూమికిని
కాటుకకొండయై కదసినయట్లు
గరిమతోచీకటి గ్రమ్మినయట్లు
హరిహరాదులమూర్తి యతనికిగలిగి
నడకలనింజొచ్చి నలుదెసల్ జూచె
అక్కడకాపున్న యఖిలరాక్షసులు
గండభైరవమూర్తి ఘనభూతవితతి
గుంపులైయున్నట్టి కొరవిదెయ్యములు
ఇరవుననున్నట్టి యెరుకలసాని
యున్నతావుకువచ్చి యొయ్యనననియె
వింటివేవార్తలు వినచిత్రంబు
గొల్లెనలచ్చటకుదురుగాజేసి
యీరుద్రభూమికి నీతడువచ్చె
ఏమికార్యమొకాని యెరుగంగరాదు
ముదముననున్నాడు మముజూచివీడు
తెలిసికోవలెవీని తెరగెల్లనిప్పు
డనిఉగ్రకోపాన నార్పులనిగూడ
కత్తులుద్రిప్పుచు గదిసికూయుచును
గట్టిగానిలిచిరి కన్నమమీద
అంతటకన్నమ అధికరోషమున
కాలాగ్నిరుద్రుడై కత్తినిదీసి
మెరపుకైవడినిల్వ మెచ్చెభూతములు
వల్లకాటికిధైర్య వైభవంబెసగ
ఎవ్వడేతెంచెనో యెరుదరాదిప్పు
డీశ్మశానములోన నెసగురుద్రుండొ
బ్రహ్మవిష్ణుడో పాకశాసనుడో
అగ్నిహోత్రుదో లేక యమధర్మరాజొ
అలనైరృతుడొ లేక అంభుదిపతియొ
పవనుడోధనదుడో ఫాలనేత్రుండొ
మునివితతికినెల్ల ముఖ్యుడోయేమొ
తెలియదమంచును దిన్నగాననిరి
ఎవడవురాయోరి యీభూమిజొచ్చి
యేమికార్యముకొర కేతెంచినాడ
వేరాజుబంటువో యెరిగింపుమనిన
పలికెగన్నమనీడు పటుశక్తిమెరయ
సోమవంశమున శోభిల్లుచున్న
అనుగురాజేంద్రున కంగనయైన
విద్యలదేవికి విభవంబుమీర
ముక్కంటివరమున ముగ్గురుసుతులు
మల్లికార్జునుయొక్క మానసరూపు
లనగజన్మించిరి అందులోమేటి
పెదమలిదేవుడు పృథ్వీతలేశు
దారాజునకుమంత్రి ఆదిదేవుండు
దొరసినరేచర్ల దొడ్డనాయునికి
పడతిశీలమయను పద్మనేత్రకును
కలికికృష్ణుండైన కారుణ్యమూర్తి
పుట్టెనుబ్రహ్మన్న భూలోకమందు
అతనికిదాసుడ నౌదునునేను
మాలలకునుబుట్టి మాలనైపోక
విష్ణుపాదముబట్టి విశ్వంబులోన
తెప్పలినాయుడు తెరవయైనట్టి
వికచాబ్జలోచన పెమ్మసానికిని
శ్రీమించుమాచర్ల చెన్నునిమేన
పెంపొందెడుతులసి పెదవనమాల
వరముగన్నట్టి వరపుణ్యసుతుడ
కన్నమనాపేరు కమలాక్షివినవె
కామునికెదిరించి కదనంబుగోరి
పగరపైదండెత్తి బవరంబునకును
వచ్చిరిమావారు వైభవంబలర
భండనక్రియకిది పట్టైనచోటు
వెనకటిరాజులు విక్రమస్ఫూర్తి
పోరాడివచ్చిన పునుకలపెంట
తొలగించిశుచిచేయ వలెనంచుదలచి
కామునిబలముల ఖండించివైచి
మడియంగవచ్చిరి మన్నెనాయకులు
పరభయంకరమైన భందనభూమి
అరసిరమ్మనిపంపె నవతారపురుషు
డైనట్టిబ్రహ్మన్న యనుచుచెప్పంగ
వినియెరుకలసాని విస్మయంబంది
ప్రళయకాలేశుండు పార్వతీశ్వరుని
పాదసేవకులైన ప్రమథులువార
లిప్పుడిటు బెసగెసంతసము
మనసులోకోరిక మాకుసిద్ధించె
బ్రహ్మనాయుడువచ్చి భాండనభూమి
పాదరేణువుచేత పావనత్వమ్ము
వెలయింపవలసిన వేళయేతెంచె
కడువేగరమ్మను కన్నమానేడె
అనినకన్నమవిని యాశక్తికపుడు
దండనమస్కృతుల్ తగజేసిమగిడి
బ్రహ్మనాయునిజూచి పదములకెరగి
కమలవల్లభవిను కంటినివింత
కంతినెరుకసాని కంటిదైత్యులను
జయమగువెంచేయు జలజలోచనుడ

" పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -4

నాయకులు శకటంబులకుఁ బూన్చుటకై యెద్దులనుఁ బేరు పేరున బిలుచుట

అనివీడుకొలిపిన నంతంతవారు
పేరుపేరునవాని బిలిచిరీరీతి
అందెలబసవన్న అదినాధుండ
నందులపిడిఘంట నాగవాసయ్య
గోవులవిటకాడ గోగుబయ్యన్న
వంటరిపలిజంకు వరపెరుమాళ్ళు
కట్టనికలుకోట కరినందిరంకె
అకలంకగాత్రుండ అంబుధిశయన
బిరుదుగరుత్మంత భీమునిగజమ
గోవర్ధనాచల గోపాలదేవ
కరినందిబసవన్న కంచివరదుడ
నెలబాలచంద్రుండ నీలవర్ణుండ
కల్లులదర్దజ జయకంఠనాద
వైకుంఠవాసుడ వాసుదేవయ్య
పుట్టలభూపతి పెంజెల్గుపెద్ద
ఇంద్రునివజ్రమా ఇప్పగిరీశ
గోగుభైరవమూర్తి గోవిందరాజ
చెంచులయోబయ్య చెన్నమల్లయ్య
కంచియేకామ్రుడా కాళికానాథా
మధురాపురిప్రియ మానందినాథా
కాముడాసోముడా కాయజవరుడ
రాముడాభీముడా రంకెలుసలుపు
మీరీతిపిలిచిన నేపుమీరంగ
వచ్చినయెద్దుల వరుసతోజూచి
వన్నెలుచిన్నెలు వడిజెప్పికొనుచు
నెత్తురుకొమ్ముల నేటైనవాని
గణుపుతోకలుగల కరిబొల్లివాని
అచ్చగాకరివన్నె లమరినవాని
మూపురంబులతోడ మొనసినవాని
నుదుటచుక్కలుగల నునుపైనవాని
తెల్లవన్నెల తెలివైనవాని
పచ్చనివన్నెలు ప్రబలినవాని
ఇటువంతిఎద్దుల నెంతయునేర్చి
గంతలుగజ్జలు గణగణమ్రోయ
గ్రక్కునయెద్దున గాండ్లగట్టించి
మోకులబంధించి ముందుగానపుడు
పంచవన్నెలకూడు పైబారదివిచి
కంబంముదర్లించె కమలనాభుండు
మర్రివేములుదాటి మండలేశుండు
ఘూర్ణిల్లురవముతో గుమ్మడంపాడు
చేరియచ్చటనిల్వ చిత్తంబువిడిచి
గరికెపాటికివచ్చి కాలూనకచట
కంకణంబులపల్లె కడనునాఘనులు
కంకణంబులుగట్తి కదలిరావేళ
పట్టభద్రులు పైడిపాటికివచ్చి
పరగవీరులకెల్ల వైనంబు చెప్పి
మెరసినమన్నీలు మేటినాయకులు
ప్రభువులుదొరలును బంధువర్గంబు
వీరవర్యులుగొప్ప విద్యలవారు
మిక్కిలిబిరుదులు మెరయుసాహసులు
కవులునుజెట్టీలు కలిసియందంద

మలిదేవరాజాదులు త్రిపురాంతకమునుండి మేళ్ళవాగుఁ జేరుట

మేళ్ళవాగుననిల్చె మించినదండు
అందరుగొల్లెన లమరంగనెత్తి
యుండిరినాయకు లుత్తలపడక
అంతలోదినకరు డస్తాద్రికరగె
సాంద్రమైచీకట్లు జగమెల్లగప్పె
విలసిల్లెచుక్కలు వినువీథియందు
గుమిగూడిపక్షులు గూళ్ళలోజేరె
చక్రవాకంబుల సంతసంబడగె
ఘనచకోరంబులు కౌతుకంబందె
కొలకులకమలముల్ కుందుచుమొగిడె
వికసించెకుముదముల్ విచ్చలవిడిని
జారకామినులెల్ల సంతోషమునను
మగలనిద్దురబుచ్చి మనసులుబెదర
కెరలివిటులగూడి గృహములువెడలి
మించిసాహసమున మేరలుమీరి
తోడికోడండ్రును తోడివారలును
గురువులుబంధులు గుర్తెరింగినను
నిందింతురనిశంక నిలుపకమదిని
వాగులవంతల వనములయందు
ఇసుకదిబ్బలయందు నిరవైనపొదల
కుంటెనకత్తెలు కూడికాపాడ
మనసులతమిమించ మదనుడావేళ
పూబాణములువింట బూనిసంధించి
మర్మముల్ నొవ్వంగ మాటికినేయ
మంచిగంధముబూయ మనసుభీతిల్ల
పువ్వులుముడువను బుద్ధియులేక
ఘననఖక్షతదంత ఘాతలువీడి
రతికుంజితంబుల రంతులుమాని
బంధచాతురియందు భావంబువిడక
కొందరునేలను గొందరునిలచి
నయముతోగొందరు నానావిధముల
కలసిరిమేనుల కంపంబులలర
చోరులుసాహస స్పూర్తులతోడ
ప్రాణంబులకుదెగి భార్యలనుమరచి
బ్రతికివచ్చెదమను భావంబువదలి
పట్టణంబులయందు పల్లెలయందు
ధనికులగృహముల తార్కొనిదోచి
సారెకుదిరుగంగ సాగిరావేళ

" పల్నాటివీరచరిత్ర '" -- ద్విపదకావ్యం -3

మలిదేవరాజు, బ్రహ్మనాయుడు త్రిపురాంతకము జేరుట

త్రిపురాంతకమునకు తిన్నగావచ్చి
మహితచారిత్రుడు మలిదేవనృపతి
రాజులుమంత్రులు రసికులుదొరలు
పాటించిసుంకర వారితోగూడ
ఆవేళనీశ్వరు నతిభక్తిజూచి
సాష్టాంగదండముల్ చెయ్యనజేసి
హస్తముల్ముకుళించి అనియెబ్రహ్మన్న
గౌరీమనోహర గంగోత్తమాగ
నాగకంకణశివ నందివాహనుడ
కాంచనగిరిచాప కంధితూణీర
గరుడాసనాంబక కైలాసవాస
ఘనగజాసురభంగ కామభస్మాంగ
లాలితశ్రీకంఠ లయకాలకర్త
సకలభూతేశ్వర శభావతార
ఫాలాక్షభూతేశ పరమేశయిపుడు
విన్నవించెదనేను వినుముసత్కరుణ
శివపురిలోనుండి చేర్చినయట్టి
భూతరాట్త్సంభంబు పొందుగానుంచి
మితిచేసిచనితిమి మీనగరంబు
మృతివచ్చెనేటికి మీకృపచేత
కార్యమీడేర్పంగ కర్తలేమీర
యనుచుప్రార్ధనజేసి యచ్చటనున్న
కంబముగనుగొని కడుభక్తిమ్రొక్కి
యినుముపిత్తళికంచు హేమతామ్రముల
పంచలోహంబుల ప్రబలినదాన
నాలుగుముఖముల నయమొప్పమరియు
ఎనిమిదిముఖముల నెన్నికైనావు
ముగురుమూర్తులునొక్క ముఖమందునిలిచి
ఒకటసిద్ధులుమరి మొక్కటమునులు
గంగయుదుర్గయు కాలభైరవుడు
నిలిచిభూదేవియు నీయాననముల
గంధర్వపతులతో కాచుచునుందు
రనుచుప్రార్ధనజేసి ఆబ్రహ్మపలికె
ఘనకార్యమపూడి కలనులోపలను
నలగామరాజుతో నయముగాబోరి
మడియంగవచ్చిరి మన్నెనాయకులు
రణరంగపట్టపు రాజువైనీవు
సాక్షివైయుండవే సర్వభూతేశ
భుక్తినిచ్చెదనీకు భూతేశుడెరుగ
దాహంబుదీర్చుకో తడుచురక్తమున
ఇప్పుడాహారంబ యిదిగికొమ్మంచు
కంబమునకునిట్లు గట్టిగాజెప్పి
పెక్కువిధంబుల పిండివంటలును
పరమాన్నమునుమంచి పప్పుకూరలును
పానకంబులుజున్ను పచ్చళ్ళునెయ్యి
ఖండశర్కరతియ్య కందగడ్దలును
కొనితెచ్చికుంభము కొండలరీతి
కస్తూరికర్పూర కాశ్మీరసహిత
చందనలేపంబు సరివియొనర్చి
మైసాక్షిసాంబ్రాణి మంచిగుగ్గిలము
తోడుగలెస్సగ ధూపమర్పించి
ఘనమైనపోతుతో గావుజెల్లించి
ఆహారమంతట అర్పించిపిదప
కంబముంచినయట్టి ఘనశకట
నిచయంబుదరలింప నిలిచిబ్రహ్మన్న
శకటచక్రంబులు సమ్మతిగావ
నాయకావళినెల్ల నయముతోబిలిచి
వితరణచతురుడై విడియంబులిచ్చి
యెనయంగమనవీట నెసగునెద్దులను
కనుగొనితెప్పించి కాండ్లకుగట్టి
చయ్యనబండ్లను సాగింపుమనియె.

పల్నాటివీరచరిత్ర '" -- ద్విపదకావ్యం -2

మలిదేవరాజు, బ్రహ్మనాయుడు మెదలయినవారు కార్యమపూడి యుద్ధరంగమునకు బయలుదేరిపోవుట

అటమీదభూమీశు డధికోత్సవముల
ఘనకార్యమపూడి కదనరంగంబు
చేరబోవుటకునై చింతించియపుడు
ప్రజలతోమేడపి బదిలంబుసేసి
పరగమువ్వురుపతుల్ పైనంబుగాగ
ఎలమిభూసుర పురోహితులెల్లపూని
జయముహూర్తముబెట్టి చనుమని చెప్ప
తొల్లియేకాదశి దురమౌనటంచు
రణభేరివేయించె రమణీయముగాను
అతులసాహసవృత్తి నాదండువెడలె
గొల్లెనల్ గట్టిన గొప్పలౌబండ్లు
బల్లానిపెట్టెలు పట్టెమంచములు
తరుచైనపీటలు తమ్మిపడిగెలును
వింతమందసములు వెలయుగొడ్గులును
కాశ్మీరకస్తూరి గంధకర్పూర
మాదిగావాసన లమరుపెట్టెలును
బొక్కసంబులబల్వు బోనగావళ్ళు
జవ్వాదిపిట్తలు శారికాకీర
పంజరములువట్టు పరిచారకులును
కోడెకాండ్రదలించి కొట్టెడురెడ్లు
పడివాగెతేజీలు పాలకీజోళ్ళు
అష్టభాగ్యంబుల అంగళ్లవారు
సందడిపడదండు చయ్యనగదలె
పెంపైనపాలకి పెదమల్లుగదలె
పినమల్లుగదలె పృధ్వీశువెనుక
తమ్ముడుగదలెను ధరణీశువెంట
పచ్చలులింగాలు పట్టుగాజెక్కి
బాగుచేసినయట్టి పాలకియెక్కి
పలుమారుపుత్రుకై పలివరింపుచును
కొలువులోనాయుడు కొనరెట్టవట్టి
కులపగదీర్పని కొడుకితడంచు
పెట్టెనాచేతిలో ప్రియతనూజాతు
బాలునితెగువ యేపాటిదోయనుచు
కొమ్మభూమీశుండు గొబ్బునగదలె
అల్లాణరాజులు అచ్చోటినృపులు
అన్నలుదమ్ములు అందరుగూడి
సూర్యవంశమువారు సొంపుతోచనిరి.
వారికివీరికి వరమంత్రియైన
నీలవర్ణుండును నియతచిత్తుండు
బ్రహ్మన్నగదలెను పాయనివేడ్క
పట్టిరిగొడుగులు పాలకినెత్తి
సూర్యతాపంబు పైసోకనియట్లు
పాలకీలకురెండు పార్శ్వంబులందు
అందంబుగాబట్టి రరిగెలజోళ్ళు
వింజామరంబులు వెలయగానెమిలి
కుంచలవారును గూడువీవంగ
నాయడురాజులు నయముతోచనగ
ముందుడమాయీలు మురజసంఘంబు
బూరలుభేరీలు పోటుధారలును
కాహళవంకిణి కాలికొమ్ములును
శంఖసమూహంబు ముఖవీణవితతి
నరగలుతప్పెటల్ నయమైనడోళ్ళు
తమ్మటమ్ములునెంచదగువీరణములు
ఘనమైనరుంజలు కనకతప్పెటలు
చేగంతలును మరి చిరుగంటచయము
ఘనమైనమ్రోతచే గగనంబుగప్ప
కుంభిణివణకంగ కులగిరులెల్ల
మారుమ్రోతలనీదు మనసులుప్పొంగ
ఆవాలవారును ఆణెమువారు
కొండ్లవిందులవారు గోవిందువారు
ముతసానివారును ముయ్యూరువారు
నర్మాలవారును నాయనివారు
పైడిచుక్కల పాలపర్తివారలును
పాలుమూరివారును పాలెమువారు
రేవనూళ్ళలవారు రేచెర్లవారు
అట్లూరి ముట్లూరి యాఖ్యలవారు
చెవులవారునుమరి చిల్లరవారు
గురియైననాయకుల్ గూడియేతేర
గుండువారేగురు గదిసినవేడ్క
చనిరిబిరుదులతో సహసమడర
ఒప్పుగానిందరు నురువైనబండ్లు
ఘోటకంబులుమేటి కుంజరావళులు
ఉత్సాహమున హుటాహుటినడువంగ
భట్టువారలమించి బహువిధంబులను
బిరుదుపద్యంబులు పెళ్ళుగాజదువ
ఉద్ధతిమస్టీలు నొనరనిర్వంక
భైరవఖడ్గముల్ పట్టుకరాగ
శీలమ్మతనయుని సింహవిక్రముడు
కరమర్ధికనుకుల కన్నమనడిచె
సకలవీరచయంబు సంతతోత్సాహ
పొరుషంబులుమీర బ్రహ్మకిట్లనియె
"మముజూడునాయుడా మాలావుకొలది
మముజూడుబ్రహ్మన్న మాశౌర్యపటిమ
సింధూరంబులమీద జెన్నుగాదుమికి
కుంభస్థలంబులు క్రుంగజేసెదము
కొదమసింగబుల గూలద్రోసెదము
గండభేరుండాల ఖండింతుమలుక
వాయువుబోనీక వాడినాపగలము
జాతవేదునుబట్టి చమిరివేసెదము
ఘనసముద్రముజొచ్చి కలుగజేసెదము
కుంభినికాళ్ళతో క్రుంగదన్నెదము
కులగిరిలైనను కొట్టివేసెదము
గురిజాలనేలెడు కువలయేశ్వరుని
కులపగకైపట్టి క్రొవ్వణగించి
చలమునవిడువక చంపగాగలము"
అనిపెక్కుపంతంబు లాడుచునడువ
చూచినవారలు చోద్యంబుగాగ
పటువిక్రమాఢ్యులు పలనాటివీర
వరులంచుబొగడుచు వర్ణించిపలుక
మలదేవభూతి, మంత్రిబ్రహ్మన్న
కంపింపభూస్థలి కదలిరావేళ.

" పల్నాటివీరచరిత్ర '" -- ద్విపదకావ్యం -1

ముందుమాట

పల్నాటివీరచరిత్ర గురించి విననివారుకానీ చదవనివారుకాని చాల తక్కువమంది ఉంటారు. బాలచంద్రుని యుద్ధము, బ్రహ్మనాయుడి శౌర్యం, నాగమనాయకురాలి తంత్రం ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉంది. ఈ పలనాటియుద్ధం మన ఆంధ్రుల చరిత్రలో ముఖ్యమైన సంఘటన. ఆనాటి యుద్ధచిహ్నాలు, ఈ వీరులు నిర్మించిన ఆలయాలు అవీ ఇప్పటికి మనం చూడవచ్చు. మాచర్ల చెన్నకేశవాలయం బ్రహ్మనాయుడు నిర్మించినట్టు చారిత్రిక దాఖలాలు ఉన్నాయి. ఈ వీరుల గాధలు ఇప్పటికి పాటలుగా, బుర్రకధలుగా ఆ ప్రాంతప్రజలు పాడుకుంటూనే ఉన్నారు. బ్రహ్మనాయడుని సాక్షాత్తు శ్రీకృష్ణుని అవతారంగా కొలుస్తారు. ఈ కధకి భారతకధకీ చాలాపోలికలుండటంతో దీనిని పల్నాటి వీరభారతం అని అభివర్ణిస్తారు.


ఈ కావ్యం చాలామంది రచించినా శ్రీనాధ భట్టరకుని ద్విపదకావ్యం చాల ప్రసిద్ధిచెందింది.


శ్రీరఘునాయకు జిత్తమందెంచి
శ్రీకంఠుపరమేశు శివునాత్మ-దలచి
పార్వతీదేవికి భావించిమ్రొక్కి
శివగణంబులనెల్ల చింతించిపొగడి
ప్రాకటంబుగవిష్ణు ప్రార్ధనజేసి
యిందిరాదేవిని నిచ్చలోనిలిపి
విష్ణుభక్తులనెల్ల వినుతులు సేసి
జలజజుగొనియాడి శారదనెంచి
అఖిలవిద్యలకెల్ల ఆద్యుడైనట్టి
గజముఖవిఘ్నేశు ఘనతకీర్తించి
వీరభద్రుని శౌర్య విభవంబులెన్ని
సంగమేశ్వరునకు చక్కగామ్రొక్కి
గుర్జాలగంగను గోరిప్రార్ధించి
భక్తి గోగులపాటి భైరవుదలచి
నీలమేఘశ్యాము నిజమూర్తియయిన
శీలమ్మనాయుని చిత్తమందెంచి
కడువేడ్క పోతలింగము గొనియాడి
మాచర్ల చెన్నుని మదిలోనదలచి
ఆంధ్రకవుల నుతులమరగావించి
గీర్వాణకవులను కీర్తించి మ్రొక్కి
సంగీతసాహిత్య చాతుర్యకవిత
చెప్పనేర్చినవాడ చెలగి "మాచర్ల"
చెన్నకేశవపాదసేవారతుండ
వలను భారద్వజ వంశవర్ధనుడ
కవిసార్వభౌముడ ఘనతగన్నట్టి
శ్రీనాధుడనువాడ శివభక్తిపరుడ
శాశ్వతంబైనట్టి సద్గ్రంథమొకటి
చెప్పబూనిమనసు చెలరేగియుండ
శ్రీరమ్యవక్షుండు శ్రితవత్సలుండు
వారిజనేత్రుండు వల్లవీవిటుడు
శమితభక్తజనార్తి శాశ్వతకీర్తి
కందర్పజనకుండు కనకాంబరుండు
సురరాజవిహితుండు శుభవీక్షణుండు
కరుణాంతరంగుండు కలుషభంగుండు
ఎల్లజగముల నేలెడుఘనుడు
పాలమున్నీటిపై బవళించువాడు
సోరిదినెల్లప్డు భూసురరక్షకుండు
గిరిధర్ముడగు చంద్రగిరిరంగవిభుని
వేంకటాద్రిపునకు వెలయునొక్కొక్క
సరసునకు రణసాహసాంకునకు
అలరాజుబాకున కవతారమొంది
మలసినూటొక్క బొమ్మలపెండేరంబు
చెలగిడాకాలనుంచిన మహాఘనుడు
చిలుకలపైకోర్కె జిక్కెడివాడు
చేకొన్నమాచెర్ల చెన్నకేశవుడు
నాకలలోవచ్చి నయమొప్పబలికె
వినవోయిసత్కవి వేడ్కనామాట
మనముననాకు సమ్మతమైనదొకటి
అనవిని దేవ మహాప్రసాదంబు
దృఢముగనానతి యిమ్మునాకిప్పు
డనచెన్నకేశవు డప్పుడిట్లనియె
శౌర్యంబుపుణ్యంబు సమకూర్చినట్టి
పలనాటివీరుల భాగవతంబు
ప్రకటితంబుగనీవు రచియించిమాకు
అంకితంబొనరింప ననువొందుసూవె
అనుచును శ్రీకాంతు డరిగినపిదప
మేల్కాంచిమనమున మేలయ్యెననుచు
విలసిల్లు పలనాటి వీరులచరిత
జనులెల్ల భక్తిచే చదువుటకొరకు
మంజరీద్విపదగా మన్నించినేను
చెప్పబూనితి వచః శ్రీమెరయంగ
ప్రకటితంబైనట్టి పలనాటిలోన
భావింపగావిష్ణు భక్తిని మెరసి
నరనాధసింహంబు నలగామరాజు
మహితచారిత్రుడు మలిదేవరాజు
ధారణినేలుచు తమలోనబోరి
కార్యమపూడి శ్రీకదనంబునందు
నరపాలచంద్రుండు నలగాముతాక
పంపిన బాలుండు బాహువిక్రముడు
తోరంపుగజములు తురగచయంబు
మున్నీలబలముల మహితశౌర్యమున
చెదరిపారగబోడ్చి చీకాకుసేసి
నలగాముతమ్ముడు నరసింగునెదిరి
మర్ధించిరణమున మడిసినవిధము
ప్రచురింతువీనుల పండువుగాను.

కథా ప్రారంభం

గణుతింప తత్కథాక్రమమెట్టి దనిన
అరయ మేడపిలోన అలరాజుచావు
వీరవిక్రమతచే వీరసాహసత
పరగిన నాయకుల్ పటుపరాక్రములు
వీరనాయకులెల్ల వినివెరగంది
భావించితలపోసి బాలమాల్దేవు
బిరుదురాజునుదెచ్చి పృథ్వివెలయగ
నయమైనయట్టి లగ్నంబునందతని
పట్టంబుగట్టిరి పరగమేడపిని.
భూమీశసుతునిట్లు పుడమినినిలిపి
భాస్కరసమతేజు బాలునిదెచ్చి
సచివకార్యంబున సమ్మతినుంచి
అటకరణపుకార్య మనపోతుకిచ్చి
మాడాచియనునట్టి మగువనుదెచ్చి
రాణివాసముగావ రక్తితోనుంచి
ఆనందమునుబొంది రంతటవారు.
‘బ్రహ్మాండములబట్టి బంతులాడుదును
మృత్యుదేవతనైన మెదిపి వేసెదను
బాలుడనని నన్ను భావింపవలదు
చిన్న మిరియమునందు చెడునె కారంబు?’’
పల్నాటి వీర చరిత్ర
శ్రీనాథుడు.. మాచర్ల చెన్నకేశవస్వామికి అంకితమిచ్చాడు!

Wednesday 14 January 2015

sankranthi సంక్రాంతి






పుణ్యకాల పర్వదినం

source: sakshi
పుణ్యకాల పర్వదినం
భారతీయులు అందులోనూ దాక్షిణాత్యులు, ముఖ్యంగా తెలుగువారు చేసుకునే పండగల్లో అతి ప్రధానమైనది సంక్రాంతి. ఈ రోజున తప్పనిసరిగా ఆడపడుచులని, అల్లుళ్లని పిలిచి ఆదరించి ఆత్మీయతని పంచుతారు. కొత్త అల్లుళ్లయితే విధిగా అత్తవారింటికి వచ్చి తీరాలి. ఏడాదంతా ఎక్కడెక్కడున్నా సంక్రాంతికి మాత్రం అంతా స్వగ్రామాలకి చేరుకుంటారు.

ఎందుకింతటి ప్రాధాన్యం?

సంక్రాంతి పండుగ సమయానికి దరిదాపుల్లో అన్ని పంటలు ఇంటికి వచ్చి ఉంటాయి. రైతులు మాత్రమే కాక వ్యవసాయ కూలీలు, ఇంకా సరిగా చెప్పాలంటే గ్రామంలో ఉన్న అందరు కూడా పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. పొలం పనులు పూర్తి అయి ఉంటాయి. కొంత కాలం విశ్రాంతి తీసుకునే వీలుంటుంది. దానితో సందడి, సంబరాలు. అందుకే తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమికి, రైతులకి, కూలీలకి, పాలేర్లకి, పశువులకి, పక్షులకి, మొత్తం ప్రకృతికి కృతజ్ఞతను తెలియ చేసుకోవడం, తమ సంపదను సాటివారితో, బంధుమిత్రులతో పంచుకోవటం ఈ వేడుకల్లో కనపడుతుంది.

ఈ రోజుకే ప్రత్యేకత ఎందుకు?


భారతీయులు సాధారణంగా పాటించేది చాంద్రమానాన్ని. కొన్ని సందర్భాలలో సూర్యమానాన్ని కూడా అనుసరిస్తారు. ఈ రెండు మానాల సమన్వయం సంక్రాంతి పండుగ చేసుకోవటంలో కనపడుతుంది. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. దానిని సంక్రమణం అంటారు. మకరరాశిని సంక్రమించినప్పుడు అది మకరసంక్రమణం అవుతుంది. సంవత్సరంలో ఉండే పన్నెండు సంక్రమణాలలో మకరసంక్రమణం ప్రధానమైనది. దీనికి కారణం మకర సంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటి వరకు దక్షిణ దిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్లుతుంది. అందుకే ఆ రోజు నుండి ఆరు నెలలు ఉత్తరాయణం అంటారు. అంతకు ముందు ఆర్నెల్లు దక్షిణాయనం. దక్షిణాయణాన్ని పితృయానం (పితృ దేవతలు భూలోక వాసులపై అనుగ్రహం కురిపించే కాలం) అని, ఉత్తరాయణాన్ని దేవయానం (దేవతలు అనుగ్రహాన్ని వర్షించే కాలం) అని చెపుతారు. అందుకనే ఈ రోజుని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ పుణ్య సమయంలో చేయవలసిన విధులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని సంక్రాంతి సంబరాల్లో మేళవించడం జరిగింది.

శుభములనీయవే సుబ్బీ గొబ్బెమ్మ


శుభములనీయవే  సుబ్బీ గొబ్బెమ్మ
శ్రీ సూర్యనారాయణా మేలుకో... హరిసూర్యనారాయణా మేలుకో పొడుస్తు బాలుడు పొన్నపూవు ఛాయ... పొన్న పూవుమీద పొగడంపు ఛాయ ఉదయిస్తు బాలుడు ఉల్లిపూవు ఛాయ... ఉల్లిపూవు మీద ఉగ్రంపు పొడి ఛాయ

ప్రత్యక్ష దైవంగా కొలిచే సూర్యుడు దక్షిణాయనం నించి ఉత్తరాయణంలోకి మారుతూ మకరరాశిలోకి ప్రవేశిస్తూ తీక్షణమైన తన కొత్త వెలుగులని ప్రపంచానికి ప్రసరించే పండుగ సంక్రాంతి పండుగ. ప్రతీ పండుగకీ ఓ దేవతకో దేవుడికో ప్రత్యేకత ఉన్నట్లే సంక్రాంతి పూర్తిగా అన్నింటికీ సాక్షీభూతమైన సూర్యనారాయణమూర్తిని కొలిచే పండుగ. ఆరోగ్య ప్రదాత సూర్యదేవుడు. మన భారతీయులు ప్రకృతి ఆరాధకులు. ఈ ప్రకృతి ఆరాధన సంక్రాంతి పండుగ రోజుల్లో కూడా మనకి కనిపిస్తుంది. భోగికి ముందర తొమ్మిది రోజుల ముందునించి లోగిళ్ళు చక్కగా శుభ్రంచేసి అందమైన ముగ్గులు పెట్టి వాటిపైన లక్ష్మీదేవిగా భావించే ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళు పెట్టి వాటిపై పూలతో అలంకరించి కన్నెపిల్లలు, చిన్నపిల్లలు పెద్దల సహకారంతో చప్పట్లు కొడుతూ ఆడడం ఓ అద్భుతమైన సన్నివేశం.

గొబ్బియల్లో సఖియా వినవె
చిన్నికృష్ణుని చరితము వినవె
కృష్ణుని చరితము వినరే...
ఔనట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలగిరి గొబ్బిళ్ళ గొబ్బీయల్లో....
సుబ్బీ గొబ్బెమ్మ శుభములీయవే

సుబ్బీ గొబ్బెమ్మ మొగలిపువంటి మొగుడినీయవే...  లాంటి పాటలు, ఆటలతో పదిమందితో స్నేహ సంబంధాలు కలుపుకుంటూ ఊర్లో ఒక్కొక్కరి ఇంటిముందు తొమ్మిదిరోజులు అందరు కలుసుకుని ఆడుకుని, గుల్లశనగపప్పు, అటుకులు, బెల్లం వంటివి నైవేద్యాలు పెట్టి ప్రసాదాలు పంచుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఈ రోజుల్లో ఈ ఆధునిక పరికరాల మధ్య మనకి ‘ఏవిటది సిల్లీగా’ అనిపించవచ్చు కానీ, ఆధునీకరణ లేని రోజుల్లో ఆడపిల్లలని బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు. మహిళలకి మరొక వ్యాపకం లేక ఇంటికే అంకితమయ్యేవారు. ఇలా పండగల్లో, పబ్బాల్లో నోములని, వ్రతాలని గొబ్బిళ్ళని పసుపుకుంకుమలని ఇచ్చిపుచ్చుకుంటూ రోజూవారి దినచర్య నుంచి బయటపడి ఆనందం పొందేవారు. అలాంటి వేడుకే భోగి పళ్ళు పోయడం. ఇంట్లో అయిదేళ్ళు పదేళ్ళ లోపు పిల్లలకి భోగిపళ్ళు పోసేవారు. చెరుకుముక్కలు, రేగిపళ్ళు, చిల్లరడబ్బులు, పూలు మొదలైనవి ఓ పళ్ళెంలో కలిపి పిల్లల తలలపైన మూడుసార్లు తిప్పుతూ పాటలు పాడుతూ భోగిపళ్ళు పోసేవారు. ముత్తైవలు ఒకరికొకరు పసుపు కుంకుమలిచ్చుకుంటూ తమ సాన్నిహిత్యాన్ని ఇరుగుపొరుగులతో సాటి మహిళలతో చాటుకొనేవారు. ఒక విధంగా ఇవి అలనాటి కిట్టీ పార్టీలని చెప్పొచ్చు.
 ఇక ఈ సంక్రాంతి పండుగ రైతన్నకి ఇచ్చే ఆనందం అంతాఇంతా కాదు. దేశానికి వెన్నెముక రైతు. రైతు పండిస్తేనే మనందరికి మెతుకు గొంతులో దిగేది. సంవత్సరమంతా పడ్డ కష్టం ఇంటికి పంట రూపంలో వస్తుంది. రోజూ అన్నం తినే ముందు దేవుడి తరువాత రైతన్నకి ఓ మాటు దణ్ణం పెట్టుకుంటే మనకెంతో మేలు. దేశానికి ఎంతోమేలు.

సంక్రాంతి రోజుల్లో మనకి కనిపించే వారిలో హరిదాసులు ఒకరు. హరె హరెలొరంగ హరె.... హరెలోరంగ హరె... హరె.... అంటూ పాడుకుంటూ కృష్ణార్పణం అని దీవిస్తూ వెళతారు. వీరినే జియ్యరులు అని కూడా పిలుస్తారు. వీరు మామూలు రోజుల్లో కనిపించరు. సంక్రాంతి రోజుల్లోనే దర్శనమీయడం విశేషం. అలాగే ఈ రోజుల్లో మనల్ని పలుకరించే నేస్తం డూడూ బసవన్న.

 డూడూడూడూ బసవన్న... దొడ్డా దోరండి బసవన్నా... అంటూ  పాడుకుంటూ బసవన్నని ఇంటింటా ఆడిస్తూ వారిచ్చే పాతబట్టలు, బియ్యం, పిండివంటలని తీసుకుని వెళ్ళే బసవన్నలు రాకపోతే అసలు సంక్రాంతికి అందమే రాదు. అలాగే పిట్టల దొర, బుడబుక్కలవాడు, జంగమదేవరలు వారి పాత్రలని వారు ఈ పండుగ దినాల్లో పోషిస్తూ మనకి శుభాశీస్సులు ఇవ్వడం సంక్రాంతిలో ఓ భాగమే.

ఎటు చూసినా వెల్లివిరిసే ఈ పండగలని యధాశక్తి జరుపుకుంటూ మన పెద్దలబాటని అనుసరిద్దాం. కొత్త ఆనందాలని నింపుకుంటూ కొత్త ఆశలతో క్రాంతి పథంలో పయనిద్దాం. ఎన్నో సంక్రాంతులని జరుపుకుందాం. కృష్ణార్పణం.
source: sakshi

Friday 9 January 2015

Kanneganti Hanumanthu/ కన్నెగంటి హనుమంతు/

పుల్లరి ఉద్యమం - కన్నెగంటి హనుమంతు

కన్నెగంటి హనుమంతు కోర మీసము దువ్వి
పలనాటి ప్రజలచే పన్నులెగ గొట్టించె
బలి ఇచ్చె హనుమంతు నూ

పలనాడు! పర ప్రభుత్వము గుండ్లకు ! అని  పులుపుల శివయ్య అంటే..

మిణుగురులు లేచె బెడదవు
శౌర్యాగ్నిశిఖలు మాంచాలపురిన్
హనుమంతుడన వీరుడు

తెల్ల దొరల నేదిరించెన్. అని గుర్రం ఝాషువా అన్నారు.






 'పుల్లరి ఉద్యమం' తెలుసా..భారత స్వాతంత్ర్య ఉద్యమం..విద్యుత్ ఉద్యమం..తదితర ఉద్యమాలు తెలుసు..ఈ పుల్లరి ఉద్యమం ఏంటో అని ఆశ్చర్యపడుతున్నారా ? అయితే ఈ  పుల్లరి ఉద్యమం గురించి...
మించాలంపాడు...ఈ ప్రాంతం పేరు వింటే 'పుల్లరి ఉద్యమం' గుర్తుకొస్తుంది. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వారిలో కన్నెగంటి హనుమంతు  పుట్టిన పురిటి గడ్డ. ఆయన నడిపిన ఉద్యమాలకు చూసి ఆనాటి తెల్లదొరలు గడగడలాడారు. ఆనాటి 'అడవి పుల్లరి' ఉద్యమం ఎందరికో స్పూర్తినిచ్చింది. 

కన్నెగంటి హనుమంతు జాతి జనుల విముక్తి కోసం తన లేలేత గుండె నెత్తుటిని తల్లి భారతి పాదాలకు పారాణిగా పూసిన నిష్కళంక దేశభక్తుడు, త్యాగధనుడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పై పిడికిలి బిగించిన తొలితరం వీర విప్లవ సేనాని కన్నెగంటి హనుమంతు .తన దేశ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సాధించడం కోసం మృత్యువుకు కేవలం వెంట్రుక వాసిలో సంచరించిన సాహసి. తెలుగువారి ప్రతః స్మరణీయుడు కన్నెగంటి హనుమంతు. పల్నాడు సీమలో అరుణారుణ కాంతులతో ప్రభవించిన ప్రభాత సూర్యుడు కన్నెగంటి హనుమంతు 


గుంటూరు జిల్లా దుర్గి మండలం పరిధిలోని మించాల పాడు గ్రామంలో సామాన్య కాపు కుటుంబంలో వెంకటప్పయ్య, అచ్చమ్మ అనే పుణ్య దంపతులకు పుట్టిన అసమాన స్వాతంత్ర్య సమర యోధుడు కన్నెగంటి హనుమంతు . కన్నెగంటి హనుమంతు గాంధేయవాది. అహింసా మార్గాన స్వాతంత్ర్యం కోసం పోరాడిన దేశభక్తుడు.
పుల్లరి ఉద్యమం ఈ ప్రాంత ప్రత్యేకత... పల్నాడు సీమలో అడవుల్లో పుల్లలు ఏరుకోవడం పై, పసువులను మేపడం పై బ్రిటిష్ పాలకులు ఆంక్షలు విధించారు.పశువుకు రెండు రూపాయలు శిస్తుగా పుల్లరి కట్టాలని ఆదేశించారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరనోధ్యమానికి ఉతేజితుడైన కన్నెగంటి హనుమంతు పుల్లరి ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించాడు. అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ పాలనా వ్యవస్థ పై తన ధిక్కార స్వరం వినిపించాడు. ``ఈ చెట్టు నువ్వు పెట్టావా ? విత్తు నువ్వు పెట్టావా? నారు నువ్వు పోశావా? నీరు నువ్వు పెట్టావా? మా జీవగడ్డ పై నీకేక్కడి నుంచి వచ్చింది పెత్తనం? `` అనే పిడుగుల్లాంటి ప్రశ్నలతో కన్నెగంటి ఘర్జించాడు.``బ్రిటిష్ నిరంకుశ పాలనలో భారతీయులు అనుభావిస్తున్న అవస్థలను, అవమానాలను చూసి రగిలి పోయిన కన్నెగంటి హనుమంతు పోరుబాట పట్టాడు.అనేక మంది యువకులను కలుపుకొని ఒక దండుగా కదిలాడు. తెల్లవారి పై దండయాత్ర చేసాడు. ఉడుకు రక్తం యువకులు ఆయన వెంట నడిచారు. పెద్దతరం నిండు మనసుతో కన్నెగంటి నాయకత్వాన్ని అంగీకరించారు. ఆశీర్వదించారు. మహిళలు, వృద్దులు నైతిక మద్దతు ఇచ్చారు. పలనాడు సీమలో కన్నెగంటి ప్రతాపం ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడ గడ లాడించాడు.తెల్ల వారి సైన్యం తెల్ల మొఖం వేసింది. వారి కుయుక్తులు కన్నెగంటి సాహసం నిబద్దత ముందు తుత్తునీయలు అయ్యాయి. అయితే... బ్రిటిష్ జనరల్ టి. జి. రుదర్ ఫర్డ్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెర్నర్ కొంత మంది స్థానిక వంచకులను చేరదీసాడు. ఎప్పటికప్పుడు కన్నెగంటి కదలికలు తెలుసుకొని ఆయనను మట్టు బెట్టాలని ప్రయత్నాలు చేసాడు. తమ వీరబిడ్డడు కన్నెగంటిని ప్రజలే కాపాడు కొన్నారు. దాంతో బ్రిటిష్ జనరల్ టి. జి. రుదర్ ఫర్డ్ ఒక కుట్ర పన్నాడు. కన్నెగంటిని ప్రలోభాలతో లొంగ దీయాలని తలపోసాడు. కరణం ద్వారా వర్తమానం పంపాడు. దుర్గి ఫిర్కకు కన్నేగంటిని జమిందార్ గా చేస్తామన్నారు. ఇష్టం వచ్చినంత శిస్తు వసూలు చేసుకోవచ్చని ఆశ పెట్టారు. కానీ నిష్కళంక దేశభక్తుడైన కన్నెగంటి తాను తార్పుడు గాడిని కాననీ, నా తోటి భారతీయులను వంచించి నెత్తుటి కూడు తిననని తెగేసి చెప్పాడు. 1922 ఫిబ్రవరి 22 ఉదయం కొందరు అటవీ, రెవిన్యూ శాఖలకు చెందిన అధికారులు మించాల పాడు గ్రామానికి వచ్చి హనుమంతును కలిసి పుల్లరి కట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. ఆప్పటికే గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని విరమిస్తూ నిర్ణయం తీసుకొని వున్నారు కనుక పుల్లరి చెల్లించడానికి అభ్యంతరం లేదని కన్నెగంటి చెప్పారు. గ్రామస్తులందరి పుల్లరి కట్టడానికి తాను సిద్దంగా ఉన్నానని వారికీ చెప్పి పంపారు. అదే రోజు మధ్యాహ్నం మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని ముటుకూరు లింగం కోటయ్య అధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభ కోటప్ప కొండకు బయలుదేరింది . మించాల పాడు తోసహా చుట్టు పక్కల గ్రామాలలోని యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కన్నెగంటి అనుచరులు, అభిమానులు కాంగ్రెస్ ప్రభతో కలసి వెళ్ళారు. గ్రామాల్లో మహిళలు, వృద్దులు మాత్రమే ఉన్నారు. అదే అదనుగా భావించిన బ్రిటిష్ సేనలు గ్రామాన్ని దిగ్భందం చేసాయి. పశువులను మందగా చేసి తోలుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అడ్డు వచ్చిన వారిని తుపాకి మడమలతో కొట్టి హింసించారు. విషయం తెలుసుకొని అధికారులతో మాట్లాడి పుల్లరి చెల్లించి రావడానికి కన్నెగంటి ఆ దిశగా వెళ్ళాడు. ఆగండి. ఎవరిని హింసించకండి. పుల్లరి చెల్లించడానికి మేము సిద్దం అని ఆయన సైగలు చేస్తున్నా వారు లక్ష్య పెట్టలేదు. కన్నెగంటి అతనే అని గుంటనక్క కరణం చుపించగానే ఎటువంటి మాటామంతి లేకుండా, ముందస్తు హెచ్చరిక లేకుండా కన్నెగంటిని బ్రిటిష్ సేనలు చుట్టు ముట్టాయి. శిస్తు కట్టడానికి మేము సిద్దం అని చెబుతున్నా వినకుండా కన్నెగంటిపై కాల్పులు జరిపారు. 26 తూటాలు కన్నెగంటి శరీరంలోకి దూసుకుపోయాయి. అయాన తోపాటే వున్న ఇంటి పాలేరు ఎల్లంపల్లి శేషయ్యను కూడా పాశవికంగా కాల్చి చంపారు. రక్ర్హం మడుగులలో పడి ఉన్న కన్నెగంటి చుట్టూ వలయంలా సేనలు నిలబడి గ్రామస్తులను దరిచేరనివ్వలేదు. కన్నెగంటి హాహాకారాలు చేస్తున్నా ఆసుపత్రికి తరలించ నివ్వలేదు. దాహం అని అరుస్తున్నా మంచి నీరు ఇవ్వలేదు. తమ ప్రియతమ నాయకుడికి గ్రామస్థులు మంచి నీరు ఇవ్వబోగా బ్రిటిష్ తొత్తులు అడ్డుకున్నారు. హనుమంతు భార్య గంగమ్మ తెచ్చిన నీటిని నేల పాల్జేశారు. ఈ దాష్టీకం సహించలేని గ్రామస్థులు కారం, బరిశలు, విల్లంబులతో తిరగబడ్డారు. కాని సర్కారు సేనల బలం ముందు నిలవలేక పోయారు. ఆ రాత్రంతా గ్రామం పైబడి దోచుకున్నారు.

సాయంకాలం 6 గంటలకు తుపాకి తూటాలకు గాయపడిన పల్నాడు సింహం కన్నెగంటి అర్థరాత్రి వరకు శక్తీ కూడదీసుకొని వందేమాతరం అని నినాదాలు చేస్తూనే ఉన్నాడు. అర్థరాత్రి దాటాక పల్నాటి వీరబిడ్డడు అమరుడయ్యాడు. పల్నాడు సీమలోని ప్రతి ఒక్కరు కన్నెగంటి మరణానికి కన్నీరు కార్చారు. కాక ఎక్కిపోయారు. ఆ మర్నాడు కోలగుంట్లలో హనుమంతు,మరో ఇద్దరి భౌతిక కాయాలను బ్రిటిష్ సేనలు పూడ్చి పెట్టి వెళ్ళాయి. ఇంతటి మహోన్నత సాహసం, పోరాటం కనబరచిన కన్నెగంటి హనుమంతు పేరును గుంటూరు జిల్లాకు పెట్టాలనే అభ్యర్ధన సర్వత్రా వినిపిస్తోంది. అదే ఆమేయమైన దేశ భక్తుడికీ, ఆయనను కన్న పురిటి గడ్డ గుంటూరుకి న్యాయం చేసినట్లవుతుందని ప్రజలు భావిస్తున్నారు. కన్నెగంటి కనబరచిన దేశభక్తిని విద్యార్థులకు బోధించాల్సి వుంది.కోలగుంట్ల లోని ఆయన సమాధిని వీరఘాట్ గా అభివృద్ధి పరచి విశేష ప్రాచుర్యం కల్పించవలసి ఉంది. ప్రతి ఏట కన్నెగంటి జయంతులు, వర్ధంతులు ప్రభుత్వ లాంచనాలతో జరిపించమని కోరుతున్నాము. గుంటూరు జిల్లాను కన్నెగంటి హనుమంతు జిల్లాగా పిలవడమే అంతటి స్వాతంత్ర్య సమర యోధుడికి, నిష్కళంక దేశభక్తుడు,, వీర విప్లవ వేగుచుక్కకి మనం ఇవ్వగల నిజమైన నివాళి.

Thursday 8 January 2015

భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు(sankranti, bhogi, kanuma )









గతానికి వీడ్కోలు పలుకుతూ... జీవితంలోకి కొత్త కాంతులు ఆహ్మానిస్తూ..
భోగి మంటల వెలుగులతో సంక్రాంతి లక్ష్మీ పలుకుతూ... వచ్చిన భోగి పండుగ
అందరికి భోగభాగ్యాలను అందించాలని కోరుకుంటూ .. భోగి పండుగ శుభాకాంక్షలు

ముద్దబంతులు.. మువ్వ మోతలు
నట్టింట కాలు పెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడి కాంతులు
పుట్టింట దీపం పెట్టు ఆడపడుచులు
కలబోసి విరబూసే మదినిండగా చలిపండుగే సంక్రాంతి.

భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రకృతి తో మనిషి సహజీవనం చేసే అసలైన పండగ సంక్రాంతి. భోగిమంటలు, భోగిపండ్లు, బొమ్మల కొలువులు, రంగవల్లులు, పల్లెసీమలు, గంగిరెద్దులు, హరిదాసులు, కోడిపందేలు, పతంగులు, ఎడ్లపందాలు, ధాన్యపురాశులు, పశువుల పూజలు, అంతకు మించి అమ్మ చేసే పిండివంటలు....  ఇవన్నీ కలగలిసి చేసుకునే అపురూపమైన అతి పెద్ద పండగే సంక్రాంతి. కష్టాలు భోగి మంటల్లో ఆహుతై ఈ సంక్రాంతి నుంచి కొత్త ఆశల కిరణాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో  ప్రసరించాలని కోరుకుంటూ మిత్రులందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు.

భోగి పళ్ళకి రేగు పళ్ళనే ఎందుకు పోస్తారు?

సంక్రాంతి పండగల్లో భోగి రోజున ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ఇంట్లో పసిపిల్లలకు భోగి పళ్ళుపోసినా రేగు పళ్ళే పోస్తారు.  ఈ కాలంలో వచ్చే అనేక రకాల పళ్ళుండగా రేగు పళ్ళనే ఎందుకు వాడతారు?  వాటికి అంత విశేషం ఎందుకు?  వాటినే భోగి పళ్ళకి ఎందుకు వాడాలి?  రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు.  పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు.   అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ  చుట్టుపక్కలవున్న చెట్లనుంచి  ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు.  సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ,  రేగు పళ్ళని తింటూ, ఆ  ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు.  ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.

బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి   సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు.  భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు.  వారి ఆశీర్వచనాలతోబాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.

Wednesday 7 January 2015

చెక్కలు

చెక్కలు కావలసినవి
 బియ్యంపిండి 1/2 కిలో
 సెనగపప్పు 1 కప్
 పెసరపప్పు 1 కప్
 పచ్చిమిర్చి 5   
వెన్న 5 స్పూన్స్
 జీలకర్ర 1 స్పూన్
 కరివేపాకు 1 రెమ్మ
 అల్లం చిన్నముక్క
 పసుపు చిటికెడు
 ఉప్పు తగినంత
 తయారుచేయువిధానం సెనగపప్పు,పెసరపప్పు అరఘంటముందు నానపెట్టాలి .పచ్చిమిర్చి,అల్లం,జీలకర్ర మెత్తగా నూరుకోవాలి ఒక బౌల్ లో బియ్యంపిండి ,వెన్న కలిపి నానినపప్పులు,అల్లం,పచ్చిమిర్చి ముద్దా,ఉప్పు,పసుపు వేసి తగినన్ని నీళ్ళుపోసి కలపాలి .చిన్న,చిన్న ఉండలుచేసుకుని అప్పడాలు చేత్తో వత్తుకుని వేయించుకోవాలి 
నేతి అరిసెలు - సంక్రాంతి స్పెషల్ వంటకాలు 

అరిసెలు తెలుగువారి అత్యంత ప్రీతిపాత్రమైన పిండివంట. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు అరిసెలు తప్పనిసరి. పిన్నా పెద్దలు మిక్కిలి ఇష్టంతో అరిసెలను ఆరగిస్తారు.ఒకరకంగా మన సంప్రదాయ వంట అని కూడా చెప్పవచ్చు.  ఈ అరిసెలు పెళ్ళైన ఆడపిల్లకి పెట్టే సారెలో కూడా తప్పకుండా పెడతాము.
 అరెసెలు చేయటం కొంచెం కష్టమైన పనే అయినా... చాలా రుచికరంగా ఉంటాయి.
మొదటి రోజు బియ్యం నానబెట్టుకోవటం, రెండవ రోజు ఆ నానిన బియ్యాన్ని పిండి పట్టించి మెత్తగా జల్లించి ఈ పిండిని బెల్లం పాకం పట్టి అందులో జల్లించిన పిండిని కలిపి అరిసెలు చేసుకోవటం ఇది అరిసెల ప్రహసనం.


నేతి అరిసేలకు కావలసిన పదార్థాలు: బియ్యం: 2 కిలోలు 










బెల్లం తరుము: 1 కిలో 











నువ్వులు: 100 గ్రాములు 






నీరు: 2 గ్లాసుడు  (తగినంత) 













యాలకులు: 6-8 (మెత్తగా పొడిచేసుకోవాలి)














నెయ్యి: 2 గ్లాసుడు  














నూనె: వేయించడానికి సరిపడా








 తయారు చేయు విధానం: 

  • ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఉదయం చిల్లులగిన్నెల్లో వడపోసి  పిండి పట్టించుకోవాలి. 
  • పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి. 
  • తర్వాత స్టౌ మీద మందపాటి గిన్నె పెద్దది పెట్టుకుని అందులో చిదిమిన బెల్లాన్ని వేసి కొద్దిగా నీరు పోసి పాకం పట్టుకోవాలి. (అరిసెలు గట్టిగా కావాలంటే ముదురుపాకం, మెత్తగా కావాలంటే లేతపాకం) పాకం రాగానే నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. 
  • తర్వాత బియ్యం పిండి ఒకరు వేస్తుంటే మరొకరు ఉండ చుట్టకుండా కలపాలి. 
  • ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉండేంతవరకూ పిండి వేసి కలపాలి.
  • ఇలా పిండి పాకంతో తయారు చేసుకొన్న తర్వాత స్టౌ ఫ్రైయింగ్ పాన్ పెట్టుకోవాలి. 
  • అందులో నూనె వేసి కాగనివ్వాలి. ఈలోపు పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లాస్టిక్‌ కవర్‌ మీద అరిసెలు వత్తుకొని కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి. 
  • బంగారు వన్నె రాగానే వాటిని తీసి అరిసెల పీటపై (గరిటెలు కూడా ఉంటాయి) ఉంచి వత్తుకోవాలి. దీనివల్ల అరిసెల్లో అదనంగా ఉన్న నూనె పోతుంది. 
  • వీటిని ఆరబెట్టుకోవాలి. 
  • ఆరిన తర్వాత భద్రపచుకోచ్చు. 
  • ఇవి ఒక నెల రోజుల పాటు నిలవ ఉంటాయి. 
  • అంతే నోరూరించే అరిసెలు రెడీ..!
ఇక ఇంటిల్లిపాది సంక్రాంతిని పిండి వంటకంతో ఆనందించండి.