Wednesday 26 November 2014

పల్నాటి చరిత్రకు మేడపి గ్రామం అద్దం పడుతోంది.

పల్నాటి చరిత్రకు మేడపి గ్రామం అద్దం పడుతోంది. 
నాయకురాలు నాగమ్మ కుతంత్రాలతో జరిపిన కోడి పందాల్లో ఓడిపోయిన బ్రహ్మనాయుడు పందెం ప్రకారం రాజ్యం వదిలి వచ్చినప్పుడు ఆయన నివశించిన ప్రాంతమే ఈ మేడపి గ్రామం. పందెంలో ఓడిపోయిన బ్రహ్మనాయుడు శ్రీశైలం వెళ్లి కొంతకాలం మల్లిఖార్జునుని సేవించి ఆ తర్వాత మార్కాపురం వచ్చి అక్కడ చెన్నకేశవున్ని ఆరాధించాడు. అనంతరం త్రిపురాంతకం వచ్చి అక్కడ సమీపంలో ఉన్న మేడిచెట్లను కొట్టేసి గ్రామాన్ని నిర్మించడంతో మేడపిగా పేరొచ్చింది. ఆ గ్రామంలోనే యుద్ధ శిక్షణ ఇచ్చారు. అందుకే ఈ గ్రామానికి వీర మేడపి అన్నపేరు సార్థకమయ్యింది. ఆ గ్రామంలో బ్రహ్మనాయుడు చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించాడు. బ్రహ్మనాయుడే స్వయంగా చెన్నకేశవుని విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్టించినట్లు చెబుతారు. నాగమ్మ బ్రహ్మనాయుడుల మధ్య రాయభారం విఫలం అయిన తర్వాత యుద్ధం అనివార్యమయ్యింది. యుద్ధ ప్రతిజ్ఞలు చేసి కంకణాలు కట్టుకున్న ప్రాంతం నేడు కంకణాలపల్లిగా విరాజిల్లుతోంది. ఈ గ్రామంకూడా మేడపి సమీపంలోనే ఉంది. బ్రహ్మనాయుడు యుద్ధానికి వెళ్తూ త్రిపుర సుందరీ దేవిని కొలవటంతో ఆ స్థలం త్రిపుర వరం అనే పేరుతో సార్థకమయ్యింది. అప్పట్లో బ్రహ్మనాయుడు కొడుకు బాలచంద్రుడు ఈ ప్రాంతంలో బొంగరాలు ఆడుకోవడంవల్ల బొంగరాలగడ్డనే పేరొచ్చింది. ప్రస్తుతం బొంగరాల గడ్డకు సాగర్ జలాలు పారే అవకాశం ఉన్నా మేడపి గ్రామస్థులు మాత్రం చారిత్రాత్మక చిహ్నంగా బొంగరాలగడ్డనుకాపాడుతూ వస్తున్నారు.

No comments:

Post a Comment