Saturday 29 November 2014

హైదరాబాద్ టు శ్రీశైలం వయా సాగర్



రోజువారీ పనుల్లో ఫుల్ బిజీ. అందులోనూ నగర వాసులైతే ఇక చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సరదాగా వీకెండ్ ఎంజాయ్ చేయడం కోసం ఎక్కడికెళ్లాలా అని చాలా మంది తెగ ఆలోచిస్తుంటారు. అయితే ఓ ప్లాన్ వేసుకొని అది కాస్తా అమలుచేసే సరికి వీకెండ్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని పర్యాటక ప్రదేశాలుండి ఏం లాభం? ఏమీ చూడలేకపోయాం అని దిగులుపడుతుంటారు. ఇలాంటి వారి కోసం ఏపీ టూరిజం బ్రహ్మాండమైన ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ టైంలో ఎక్కువ ప్రదేశాలు తిరిగొచ్చేలా హైదరాబాద్ శ్రీశైలం ట్రిప్ ప్లాన్ చేసింది.

ఏపి టూరిజం అందిస్తున్న హైదరాబాద్ శ్రీశైలం రెండు రోజుల టూర్-లో భాగంగా ముందుగా నాగార్జునసాగర్ వరకూ వెళ్ళేందుకు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బేగంపేటలోని ఏపి టూరిజం ఆఫీస్ నుండి బస్సు బయలుదేరుతుంది. సుమారు మూడున్నర గంటల ప్రయాణం తర్వాత నాగార్జునసాగర్ చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్-కు 170 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి చేరుకోగానే మొదటగా మనకు సాగర్ డ్యాం కనిపిస్తుంది. డ్యాంకు ఎదురుగా ఉన్న బ్రిడ్జిపై బస్సు ఆగుతుంది. అక్కడి నుంచి మన విహారయాత్ర మొదలవుతుంది.

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో చూడదగిన ప్రదేశాలలో ఫరహబాద్ అటవీ ప్రాంతం ఒకటి. ఈ అటవీ ప్రాంతంలో టైగర్ వ్యాలి ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ అడవిలో పులులతో పాటు మరెన్నో వన్య ప్రాణులు ఉంటాయి. పక్షుల కిలకిలారావాలతో పాటు, అడవితల్లి అందాలను దగ్గరగా చూడొచ్చు. టైగర్ వ్యాలీ పులులకు నిలయం. ఇక్కడకి వచ్చిన పర్యాటకులు జంగల్ సఫారీ చేస్తుంటారు. ఇక దీనికి తోడు అటవీ అందాలు, పచ్చని ప్రకృతి సోయగాలు ఆహ్లాదకర వాతావరణంలోకి తీసుకెళ్తుంది. అటవీ ప్రాంతం చివరికి చేరుకున్నాక అక్కడి వ్యూ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రకృతి అందాలను చూడడానికి రెండు కళ్ళూ చాలవంటే అతిశయోక్తి కాదు.

ఇలా ఎన్నో, ఇంకెన్నో ఆసక్తికర విషయాలు, మనసును దోచుకునే అందాల మేళవింపైన ఈ టూర్ మీకు బాగా నచ్చింది కదూ. ఎప్పుడూ వీకెండ్-లో పార్కులకు వెళ్ళీ వెళ్ళీ బోర్ కొట్టిందా? అయితే ప్లాన్ చేసుకొని ఓ రెండు రోజుల పాటు కాంక్రిట్ జంగల్-ను వదిలి ఇలా ప్రకృతి అందాలను ఆస్వాదించండి. అది మీ టెన్షన్స్-ను దూరం చేసి మిమ్మల్ని మీకే కొత్తగా చూపిస్తుంది. ఈ టూర్-కి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే. వీకెండ్స్-లో అయితే పెద్దలకి 3200 పిల్లలకి 2500. అదే వీక్ డేస్-లో అయితే పెద్దలకి 2900, పిల్లలకి 2300 చెల్లిస్తే చాలు అంతా వాళ్లే చూసుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా హైదరాబాద్ టు శ్రీశైలం టూర్ ప్లాన్ చెయ్యండి ప్రకృతి అందాలను ఆస్వాదించండి. ఈ మరుపురాని గుర్తులకి మీ జీవితంలో కూడా చోటు కల్పించండి.

హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్-కు చేరుకున్నాక డ్యాం నుంచి నాగార్జునకొండకు లాంచీలో వెళ్ళాల్సి ఉంటుంది. నీళ్లలో అదీ లాంచీలో ప్రయాణమంటే వేరే చెప్పాలా? వినిడానికే చాలా బాగుంది. ఇక స్వయంగా ప్రయాణం చేస్తే ఇంకెంత బావుంటుందని అనుకుంటున్నారా? అయితే చూడండి మరి.

హైదరాబాద్ నుండి శ్రీశైలం ప్రయాణంలో మొదటగా మనం నాగార్జునసాగర్ చేరుకున్నాం కదా. ఇక ఇక్కడి నుండి దాదాపు ఏడు గంటల పాటు క్రూయిజ్ టూర్ మొదలౌతుంది. అంటే అసలు అడ్వంచర్ జర్నీ ఇక్కడి నుండి ప్రారంభం అవుతుందన్నమాట.

పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మపై పకృతిని ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం ఎంతో బాగుంది కదా! లాంచీ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ, ఎత్తైన కొండలు, పచ్చని చెట్ల మధ్య నీటిలో ప్రయాణం. ఆ అనుభూతే వేరు. ఇలా సాగుతున్న ప్రయాణంలో రిజర్వాయిర్ మధ్యలో ఓ చిన్నపాటి ద్వీపకల్పంలా మనకు నాగార్జునకొండ కనిపిస్తుంది. ఈ కొండపైనే ఆచార్య నాగార్జునుడి విశేషాలు తెలిపేలా ఏర్పాటు చేసిన మ్యూజియం ఉంది.

నాగార్జున మ్యూజియంలో బుద్ధుడికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. ఇక్కడి శిల్ప కళ, శాతవాహనులు, ఇక్ష్వాకుల రాజవైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. మూడు, నాలుగు శతాబ్దాలకు సంబంధించిన శిల్పకళలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. నాగార్జునసాగర్-కు అతి సమీపంలో ఎత్తిపోతల జలపాతం వస్తుంది. చంద్రవంక కొండల నుంచి ప్రవహించే ఈ జలపాతం 22 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడి కృష్ణా నదిలో కలుస్తుంది. అంతే కాకుండా సూర్యాస్తమయం తర్వాత ఈ జలపాతం కొత్త కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. అన్నిటికన్నా నాగార్జునకొండపై నుంచి చూస్తే కనిపించే మనోహర దృశ్యాలు మనసును పులకింపచేస్తాయి.

ఇలాంటి ఉల్లాసవంతమైన వాతావరణంలో సాగే జర్నీని ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. అందులోనూ బోటులో ప్రయాణం అంటే ప్రతిఒక్కరూ ఎగిరి గంతేస్తారు. ప్రకృతి పచ్చదనంతో కప్పేసిన ఎత్తైన కొండల మధ్య సాగే జర్నీ భలేగా ఉంటుంది.

కృష్ణానదిపై ఈ ప్రయాణం దాదాపు నూట పది కిలోమీటర్ల పొడవున సాగుతుంది. సుమారు ఏడు గంటల పాటు సాగే ఈ జర్నీలో పక్షుల కిలకిలారావాలతో నీటి సవ్వడుల మధ్య ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ పచ్చటి కొండల చుట్టూ తిరుగుతు ఎగ్జైటింగ్-గా ఉంటుంది. ఇక్కడ మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ఈ ప్రయాణం ఒకేసారి దాదాపు ఐదు జిల్లాల పరిధిలో సాగుతుంది.

కొండల మధ్య బోటులో ప్రయాణం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పర్యాటక ప్రాంతం పాపికొండలు. అయితే ఇప్పుడు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్-కు కూడా బోటు ప్రయాణం చేయొచ్చు. ఈ ప్రయాణం తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో అంతులేని ఆనందాన్ని అందిస్తోంది. ఆహ్లాదకరమైన దృశ్యాలతో పాటు ఆధ్యాత్మికమైన వాతావరణం మధ్య ప్రయాణం హాయిగా సాగిపోతుంది. కూసింత కళా పోషణ ఉన్న వారినే కాదు చలనం లేని మనషులను సైతం గిలిగింతలు పెడుతుంది ఈ టూర్. ఈ ప్రయాణం మరవలేని స్మృతులను మిగులుస్తుందంటున్నారు పర్యాటకులు.

సాగర్ నుండి మొదలై శ్రీశైలం వరకు సాగే ఈ ప్రయాణంలో మనకు తెలియని ఎన్నో కొత్త, వింతైన విషయాలను తెలిపేందుకు ఇక్కడ ఓ గైడ్ కూడా ఉంటాడు. అతను ప్రతీ ప్రదేశం ప్రత్యేకతను పర్యాటకులకు వివరిస్తుంటాడు.

ఇక కృష్ణా నదిలో బోటు ప్రయాణం చేసినంత సేపూ మనకు ఇంకేం గుర్తుండదు. ఏ టెన్షన్స్ కూడా మన దరిచేరవు. అలా ఉంటుంది వాతావరణం. ఆ మనోహరమైన, ఆహ్లాదకరమైన వాతావరణానికి మనసు ఆనందతాండవం చేస్తుంది. కృష్ణా నదిలో దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణం తర్వాత శ్రీశైలానికి బోటు చేరుకుంటుంది.

సాగర్లో ప్రయాణించినంత సేపూ ఆహ్లాదంతో నిండిపోయిన మనసు కాస్తా శ్రీశైలంలో అడుగు మోపగానే ఒక్కసారిగా ఆధ్యాత్మికతతో నిండిపోతుంది. అడుగు పెట్టగానే విఘ్నాలకు అధిపతి అయిన ఆ గణనాథుడు సాక్షి గణపతిగా దర్శనమిస్తాడు. అక్కడి నుండి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన శ్రీశైలమల్లికార్జున స్వామి దర్శనంతో పాటు శిఖర దర్శనంతో మనసు దైవచింతనలోకి వెళ్ళిపోతుంది. మనసారా ఆ బోళా శంకరుణ్ని స్మరిస్తే కోరిన కోర్కెలు ఇట్టే తీరుస్తాడని భక్తుల విశ్వాసం.

శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు అక్కడి నుంచి కైలాస శిఖరానికి చేరుకుంటారు. అక్కడ వెలసిన నందిపై నవధాన్యాలు వేస్తే సకల పాపాలూ తొలగుతాయని భక్తుల నమ్మకం. ఇక ఈ శిఖరం పైనుండి చూస్తే ప్రకృతి అందాలకు ఎలాంటి వారైనా ముగ్ధులు కావలసిందే.

అక్కడి నుండి నేరుగా పాతాళగంగకు బయలుదేరతారు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంటుంది. అదేంటనుకుంటున్నారా? అక్కడి నుండి పాతాళగంగను చేరుకోవడానికి గాల్లో తేలుకుంటు వెళ్ళాల్సి ఉంటుంది. అదెలా అనుకుంటున్నారా? అక్కడి రోప్-వే ఉందిలెండి. మామూలుగా అయితే పాతాళగంగకు వెళ్ళాలంటే 721 మెట్లు దిగి వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్ళలేని వారి కోసం టూరిజం శాఖ రోప్-వే ఏర్పాటు చేసింది. రోప్-వేలో ఎక్కి నదీ జలాలను దగ్గరగా తాకుతూ, పచ్చని చెట్ల సోయగాలను ఆస్వాదిస్తూ పాతాళగంగకు చేరుకోవడం జీవితంలో మరిచిపోలేరెవ్వరు. కొద్దిపాటి భయంతో, కాస్త ఎగ్జయిట్-మెంట్-తో కూడిన ఈ రోప్ జర్నీ పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతినిస్తుంది.

రోప్-వే ద్వారా పాతాళగంగకు చేరుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక బోటులో పాతాళగంగలో సరదాగా బోటింగ్ చేసి అక్కడి నుండి పక్కనే ఉన్న ట్రైబల్ మ్యూజియంకి చేరుకుంటారు. ఆ మ్యూజియంలో శ్రీశైల పుణ్యక్షేత్ర విశిష్టతకు కారణమైన అనేక నిజాలు అక్కడ ఇంకా సజీవంగానే ఉన్నాయి. ట్రైబల్ మ్యూజియంలో నల్లమల్ల అడవుల్లో స్వామిని నెలకొల్పి నిత్యం పూజలు చేసిన మొదటి శ్రీశైల పూజారి అయిన మల్లన ప్రతిమ, అడవి జాతి అనవాళ్లను కాపాడే గిరిజనుల ప్రతిమలు సహజత్వానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటాయి. వాటన్నింటినీ చూస్తుంటే స్వచ్ఛమైన అచ్చమైన పల్లెటూరి వాతావరణం ఉట్టిపడుతుంది.
sorce: eXpresstv

No comments:

Post a Comment